కొత్త రక్తం.. పక్కా వ్యూహం

కొత్త రక్తం.. పక్కా వ్యూహం

ఇది నయా కమలం

హోరాహోరీగా జరిగిన గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్(జీహెచ్​ఎంసీ) ఎన్నికల రిజల్ట్స్​ బీజేపీకి పాజిటివ్​గా ఉన్నాయి. 2016లో టీఆర్ఎస్ 99, ఎంఐఎం 44, బీజేపీ 4, కాంగ్రెస్ 2, టీడీపీ 1 సీట్లలో గెలుపొందాయి. ఇప్పుడు రిజల్ట్స్​లో భారీ మార్పులే కనిపించాయి. టీఆర్ఎస్ ఇప్పుడు 55 సీట్లకే పరిమితం కాగా, గణనీయంగా పుంజుకున్న బీజేపీ 48 సీట్లు సాధించింది. ఎంఐఎం ఎప్పటిలాగే తన సీట్లను నిలబెట్టుకోగా, కాంగ్రెస్​2 చోట్ల గెలిచి తన ఉనికిని కాపాడుకుంది.

హైదరాబాద్​ చరిత్రలోనే ఇటువంటి ఎన్నికలు ఇంతకుమునుపెన్నడూ చూడలేదు. జీహెచ్ఎంసీలోనే కాదు, అసెంబ్లీ, లోక్​సభ ఎలక్షన్లలోనూ ఇంత హోరాహోరీ పోరాటం జరగలేదు. ఈ పోరాటంతో తెలంగాణలో బీజేపీ తన స్టామినాను అనుహ్యంగా పెంచుకుంది. 24 ఎమ్మెల్యేలు, 5 ఎంపీ స్థానాలున్న జీహెచ్ఎంసీ పరిధిలోనూ తను ఇప్పుడు పట్టు సాధించింది. అదొక్కటే కాదు, ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఏం జరిగినా దాని ప్రభావం చుట్టుపక్కల జిల్లాలపైనా పడుతుంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో అనూహ్య విజయం సాధించిన తర్వాత బీజేపీలో కాన్ఫిడెన్స్​ బాగా పెరిగింది. అదే ఇప్పుడు ఆ పార్టీని గ్రేటర్​లో ముందుకు నడిపించింది. మరోవైపు కాంగ్రెస్​ పార్టీ దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది.

తెలంగాణలో బీజేపీ ఫ్యూచర్​ ఏంటి?

ఎ. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తామేనని నిరూపించుకోవడానికి బీజేపీ జీహెచ్ఎంసీ ఎలక్షన్లను బాగా యూజ్​ చేసుకుందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. గతంలో టీఆర్ఎస్​కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్​ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్​ను బీజేపీ ఆక్రమించుకుంది. ఇప్పుడు టీఆర్ఎస్​ను వ్యతిరేకించే వారు ఎవరైనా బీజేపీకి మద్దతుగా నిలబడుతున్నారు.

బి. రాష్ట్రంలో బీజేపీ కూడా కొత్త లీడర్​షిప్​కు చాన్స్​ ఇచ్చింది. అలాగే చాలామంది వేరే పార్టీల నాయకులు కూడా ఇప్పుడు బీజేపీలో చేరారు. వారికి పార్టీ గౌరవం ఇస్తోంది. కానీ బీజేపీ పవర్​ను మాత్రం మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికే అప్పగించింది. గతంలో నాయకత్వం లేని వారికి పగ్గాలు ఇచ్చింది. బీసీలు, దళితులు, గిరిజనులు బీజేపీలో కంఫర్టబుల్​గా ఉండటానికి ఇది మేజర్​ స్టెప్​గా పనిచేసింది. పార్టీలో కులాలకు, వారసత్వానికి, భూస్వాములకు లేదా స్వార్థ ప్రయోజనాలకు అవకాశం ఇవ్వలేదు. కొత్త లీడర్లలో ఎనర్జీ ఉంది. అది దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

సి. ఇక బీజేపీ ప్రతి ఎన్నికను చాలా సీరియస్​గా తీసుకుంటోంది. జీహెచ్​ఎంసీ మున్సిపల్​ ఎలక్షన్​ అయినా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు హైదరాబాద్​కు వచ్చారు. ఒక ప్రముఖ లీడర్​ తర్వాత మరో ప్రముఖ లీడర్​ వెంటవెంటనే రాష్ట్రానికి వచ్చారు. దీనినే కార్పెట్​ బూమింగ్ అంటారు. భవిష్యత్తులో తెలంగాణపై బీజేపీ సెంట్రల్​ లీడర్లు మరింత ఫోకస్​ పెడతారని మనం ఎక్స్​పెక్ట్​ చేయవచ్చు.

కొత్త రక్తానికే పవర్​

పార్టీ కార్యకర్తలకు బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది. దాంతో పార్టీలో జవాబుదారీతనం పెరిగింది. పార్టీ ఎదగడానికి కొత్త రక్తం తప్పనిసరిగా కావాలని బీజేపీ ఈ పంథా ద్వారా తెలియజెప్పింది. ఉన్న ట్యాలెంట్​ సరిపోకపోతే, కొత్త లీడర్లను తెచ్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. కొత్తగా పార్టీలో చేరే వారికి సత్తా ఉందా లేదా అనేదానిపై బీజేపీ లీడర్​షిప్​ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంది. ఇదే రూట్​ను ఫాలో అయ్యింది కాబట్టే బెంగాల్, ఒడిశా, అస్సాంలో బీజేపీ అద్భుతమైన ప్రగతి సాధించింది. కొత్త రక్తం అనే సేమ్​ ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేసింది.

తెలంగాణలో బీజేపీ చేస్తున్న సోషల్​ ఇంజనీరింగ్​ను ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికైనా గుర్తించాలి. అప్పుడే తెలంగాణలోని బీసీలు, దళితులు, గిరిజనుల నుంచి బీజేపీ నాయకులను తయారు చేసినా వారు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాలను బీజేపీ సాధించిన విజయంగా ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది. బీహార్​ తర్వాత, హైదరాబాద్​లో సాధించిన ఈ విజయం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బెంగాల్, అస్సాం, తమిళనాడులో పార్టీకి మరింత బూస్ట్​ ఇస్తుంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మార్పు అనే నినాదంతో బీజేపీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అందువల్ల ప్రత్యర్థి పార్టీలు దానికి సిద్ధంగా ఉండాలి.

1. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్​ పాలన కొనసాగుతోంది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేండ్ల సమయం ఉంది. ఎక్కువ సమయం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను ఓటర్లు అంత త్వరగా రిజెక్ట్​ చేయరు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. అయితే అది ఇంకా తీవ్రమైన స్థాయికి చేరలేదు. ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరినట్లయితే ఆ ప్రభుత్వం ప్రమాదంలో పడినట్లే. ప్రస్తుతం టీఆర్ఎస్​ పార్టీ ఇచ్చిన హామీలు వచ్చే మూడేండ్లలో ఆ పార్టీకి మోయలేని భారంగా మారవచ్చు.

2. ఎంఐఎం పార్టీ నేషనల్ ముస్లిం పార్టీగా మారేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ ఈ విషయాన్ని ముందే గుర్తించింది. అందువల్లే జీహెచ్ఎంసీ ఎలక్షన్లను టీఆర్ఎస్​కు మాత్రమే కాకుండా ఎంఐఎంకు వ్యతిరేకంగా కూడా బీజేపీ తీసుకుంది. అయితే తెలివిగా ఆలోచించిన ఎంఐఎం తనకు పట్టున్న ప్రాంతాలకే పరిమితమై అక్కడ విజయం సాధించింది. మిగతాచోట్ల  మైనార్టీలు టీఆర్ఎస్ కు ఓటు వేసేలా ప్రోత్సహించింది. హైదరాబాద్​లో బీజేపీ సత్తా చాటడం ఇప్పుడు ఎంఐఎంకు ఆందోళన కలిగించే విషయమే.

3. కాంగ్రెస్​ పార్టీ నుంచి చాలా మంది లీడర్లు బీజేపీ, టీఆర్ఎస్​లో చేరారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. ఆ పార్టీని వెనక్కి నెట్టిన బీజేపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. కాంగ్రెస్​ పార్టీ బలహీనపడటంతో మైనార్టీలు ఇప్పుడు టీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారు.

4. ఈ ఎన్నికల్లో ఎక్కువగా లాభపడింది బీజేపీనే. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు చూపించింది. దానికి తగ్గట్టుగానే ఫలితాలను సాధించింది. దుబ్బాక ఉప ఎన్నిక రిజల్ట్​ను కూడా బీజేపీ బాగా వాడుకుంది. బీజేపీ ప్రధానంగా టీఆర్ఎస్ ను రీప్లేస్​ చేయడంపైనే దృష్టి పెట్టింది. దాంతో యాంటీ టీఆర్ఎస్ ఓటర్లంతా బీజేపీ వైపు టర్న్​ అయ్యారు. వారంతా కాంగ్రెస్​ను పక్కనపెట్టేశారు. సోషల్​ మీడియా ఎన్నికలను గెలిపించదని ఇప్పటికైనా రాహుల్​ గాంధీ గుర్తించాలి.