
ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా చేసింది ఓవైసీనే: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి పక్కన చేరడం ఓవైసీ బ్రదర్స్ పని అని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ చార్మినార్ అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర సందర్బంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఓల్ట్ సిటీ అభివృద్ధి చెందకుండా చేసింది, మెట్రో రాకుండా చేసింది ఓవైసీయేనని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రజలు నిజాలు గ్రహించి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. బీజేపీ ఒక్కసారి అవకాశం ఇస్తే ఓల్డ్ సిటీని ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని, ఎంఐఎం కంచుకోటను ఈసారి కైవసం చేసుకుంటామని అన్నారు. మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులుంటే కేవలం 40 లక్షల మందికే రూ.500లకు సిలిండర్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ పథకాలు ప్రారంభించారని ఆరోపించారు.