ఢిల్లీ : సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ పోరాటాలను నమ్మి పార్టీలో చేరుతున్న మర్రి శశిధర్ రెడ్డికి ఆయన హృదయ పూర్వక స్వాగతం పలికారు. ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం పార్టీలోని నాయకులమంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ సర్కారు భ్రష్టు పట్టిస్తోందన్నారు.
“తెలంగాణ అభివృద్ధి గురించి కేసీఆర్ ఆలోచించడం లేదు. కనీసం జీతాలు కూడా ఇయ్యలేని స్థితిలో రాష్ట్రం ఉంది. సంక్షేమ పథకాలను సైతం అమలు చేయలేకపోతున్నరు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకొని.. పైకి కొట్లాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్నాయని పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్, టీఆర్ఎస్ లతో బీజేపీ అలుపెరగకుండా పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. “కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోడీని తిట్టడంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారు. తెలంగాణ అభివృద్ధి గురించి కేసీఆర్ ఆలోచించడం లేదు ”అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.