కేసీఆర్ తెలంగాణ అమ్రీష్ పురి: బండి సంజయ్

కేసీఆర్ తెలంగాణ అమ్రీష్ పురి: బండి సంజయ్

మెదక్: సీఎం కేసీఆర్ రాష్ట్రానికి అమ్రీష్ పురిలా తయారయ్యాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. జిల్లాలోని నర్సాపూర్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ సహా పలువురు టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందన్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. అబద్ధాలతో కేసీఆర్ పబ్బం గడుపుతున్నారని, ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. లక్షా ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్పిన కేసీఆర్... ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నీళ్లు అందించిండో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ పేరుతో కేసీఆర్ కొత్త నాటకానికి తెర లేపారన్న సంజయ్... రాష్ట్రానికి ఏం చేయలేనోడు దేశానికి చేస్తాడా అని నిలదీశారు. రైతు బంధు ఇచ్చి... రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలను కట్ చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర రైతులను ఆదుకోని కేసీఆర్ పంజాబ్ రైతులకు మూడు లక్షలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో స్థానికులకు ఉద్యోగాలు రాలేదు... కానీ ఆయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎన్ని పీడీ యాక్టులు పెట్టినా బీజేపీ భయపడబోదన్న సంజయ్.. కేసీఆర్ ను ఓడగొట్టేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గడీల పాలనను బద్దలు కొడతామని, ఇందుకు ప్రజలు బీజేపీకి సహకరించాలని బండి సంజయ్ కోరారు.