
- పాక్ తోక జాడిస్తే కత్తిరించేస్తాం
హైదరాబాద్, వెలుగు: ఉగ్రదాడులపై దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోతే క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించే విధానానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్తాన్ ఒక్క దాడి చేస్తే, వందరెట్లు ప్రతిదాడి చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పాక్ కు నిరూపించామని తెలిపారు. ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని సనత్నగర్ లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి చూశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్ పేలుళ్లు, ముంబైలో దాడులు, పార్లమెంట్ పై దాడి ఇలా అనేక దాడులతో 46 ఏళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని భారత్ పై ఎగదోస్తూ అనేక మంది ప్రాణాలను బలితీసుకుందనారు. గతంలో ఈ దాడుల సమయంలో నివాళులర్పించి సరిపెట్టుకునేవారమని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉరీ టెర్రర్ అటాక్స్ కు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రయిక్స్, పుల్వామా దాడికి ఎయిర్ స్ట్రయిక్స్ చేశామని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ నిర్వహించి వందల మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామన్నారు. టెర్రరిజంపై పాక్ కుక్క తోక వంకర అన్నట్లే ప్రవర్తిస్తే ఆ తోకను కత్తిరించేస్తామని హెచ్చరించారు.