ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ గోదావరి గర్జన సభ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన జేపీ నడ్డా.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సంస్కృతికి ఈ ప్రాంతం ప్రతిబింబంగా ఉందన్న ఆయన.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.

మోడీ హయాంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని జేపీ నడ్డా అన్నారు. మోడీ అవినీతి రహిత పాలనను అందిస్తున్నారన్న ఆయన.. ముందుతో పోలిస్తే పేదరికం తగ్గిందని తెలిపారు. దేశ సంస్కృతిని మోడీ మారుస్తున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కవరేజ్ అయిన ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి సాయం చేస్తున్నారని నడ్డా అన్నారు. 2014-20 మధ్య దేశ ఆదాయం చూస్తే రెండింతలైందని... అంతే కాకుండా దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. . అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా కరోనాను నియంత్రించారని నడ్డా ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో ఎయిమ్స్ సంఖ్యను మోడీ పెంచారని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తల్లో ఉండవన్న నడ్డా.. మోడీ వచ్చాక ఎన్నో సంస్కరణలకు తెరలేపారని చెప్పారు. మోడీ వల్ల రాజకీయాల్లోనూ పెను మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. మణిపూర్, గోవా, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో బీజేపీ సాధించిన విజయమే నిదర్శనమని గొప్పగా చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కూడా చరమగీతం పాడామని జేపీ నడ్డా వివరించారు.