![లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు పక్కా : అమిత్ షా](https://static.v6velugu.com/uploads/2024/02/37_YUoOxWgfJi.jpg)
అహ్మదాబాద్ : రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఎలాంటి అనుమానం లేదని.. అధికార బీజేపీ 370 సీట్లలో పక్కాగా గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, ఎన్డీఏ 400కు పైగా సీట్లలో విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. సోమవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.1,950 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రధాని మోదీ పదేండ్ల పాలనలో తొలి ఐదేండ్లు.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించినప్పుడు తవ్విన గొయ్యిని పూడ్చడా నికే సరిపోయిందన్నారు. మరో ఐదేండ్లు అభివృద్ధి అనే పునాది వేశారని తెలిపారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేస్తే.. ఆ పునాదిపై అద్భుతమైన భవనం చాలా వేగంగా వస్తుందని అమిత్ షా పిలుపునిచ్చారు.