
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 2025, సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 82 నిమిషాల పాటు కొనసాగనున్న ఈ చంద్రగ్రహణాన్ని ప్రపంచంలోని 85 శాతం మంది ప్రజలు చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్లో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. అలాగే ఇండియాలో కూడా ఈ చంద్ర గ్రహణం ప్రజలకు దర్శనమిస్తుందని తెలిపారు సైంటిస్టులు.
అయితే.. ఇండియాలో అన్ని ప్రాంతాల్లో కాకుండా ముఖ్యంగా నాలుగు ప్రదేశాల్లో చంద్ర గ్రహణం చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పారు ఖగోళ శాస్త్రవేత్తలు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరులో చంద్ర గ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించారు సైంటిస్టులు. ఈ ప్రదేశాలతో పాటు అహ్మదాబాద్, పూణే, లక్నో వంటి భారతీయ నగరాలు కూడా అద్భుతమైన వ్యూ పాయింట్లను అందిస్తాయని తెలిపారు.
ఆదివారం (సెప్టెంబర్ 7) అర్ధరాత్రి సమయంలో గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆ సమయంలో స్పష్టమైన ఆకాశం, తక్కువ కాంతి కాలుష్యం ఉండటం వల్ల ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ఈ దశాబ్దంలోనే అత్యంత పెద్దదైన (టైమ్ ప్రకారం), అత్యంత స్పష్టంగా కనిపించే ఖగోళ దృశ్యాల్లో ఒకటని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. ఈ చంద్ర గ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి అద్దాలు అవసరం లేదని చెప్పారు సైంటిస్టులు.
చంద్ర గ్రహణం ఏర్పడే, ముగిసే వివరాలు:
ఆదివారం (సెప్టెంబర్ 7) రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం (సెప్టెంబర్ 8) తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్రగ్రహణం ముగియనుంది.