
పాట్నా: బీహార్లో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. ముజఫర్పూర్ జిల్లాలోని భాగమతి నదిలో స్కూల్ స్టూడెంట్లతో వెళ్తున్న ఓ బోటు బోల్తాపడింది. గురువారం ఉదయం మధుపూర్ పట్టి ఘాట్ లో జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది చిన్నారులు గల్లంతయ్యారు. విద్యార్థులు పక్క ఊర్లోని స్కూల్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో బోటులో 30కి పైగా చిన్నారులు ఉన్నారు. సమాచారం అందగానే స్థానికులు, పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇతర రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 20 మంది విద్యార్థులను కాపాడామని.. మరో 11 మంది పిల్లల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని అధికారులు చెప్పారు. అయితే, గల్లంతైన వారిలో ఒక్కరి డెడ్ బాడీ కూడా దొరకలేదన్నారు.