తాలిబాన్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌గా అఫ్గాన్‌‌‌‌‌‌‌‌లో బాంబు పేలుళ్లు

తాలిబాన్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌గా అఫ్గాన్‌‌‌‌‌‌‌‌లో బాంబు పేలుళ్లు

జలాలాబాద్:అఫ్గానిస్తాన్ లోని నంగర్ హర్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్ సిటీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం తాలిబాన్ వెహికల్స్​ను టార్గెట్​గా చేసుకుని టెర్రరిస్టులు వరుసగా జరిపిన మూడు బాంబు దాడుల్లో ముగ్గురు మృతిచెందారు. 20 మంది గాయపడ్డారు. మృతిచెందిన వారు, గాయపడిన వారి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఏ టెర్రరిస్టు గ్రూపూ ప్రకటించలేదు. అయితే, తూర్పు అఫ్గాన్ లోని నంగార్హర్ ప్రావిన్స్​లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు బలంగా ఉండటం, తాలిబాన్లకు ఆ గ్రూపే ప్రధాన శత్రువుగా ఉండటంతో ఆ సంస్థ టెర్రరిస్టులే ఈ దాడులుచేసి ఉంటారని అనుమానిస్తున్నారు. శనివారం కాబూల్​లోనూ టెర్రరిస్టులు ఓ హ్యాండ్ గ్రనేడ్​తో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ధర్మ పరిరక్షణ శాఖ..  

మహిళలు, బాలికల హక్కులను కాలరాసేలా తాలిబాన్లు మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా మూసివేశారు. ఇరవై ఏండ్ల కింద తొలి తాలిబాన్ సర్కార్​లో మాదిరిగా మళ్లీ మతపరంగా కఠిన విధానాన్ని అమలుచేసే శాఖను విమెన్స్ మినిస్ట్రీ స్థానంలో ఏర్పాటు చేశారు. కాబూల్ లోని విమెన్స్ మినిస్ట్రీ బిల్డింగ్ కు ఉన్న బోర్డును తొలగించిన తాలిబాన్ లు శుక్రవారం ‘‘ధర్మ పరిరక్షణ, చెడు నివారణ (ప్రమోషన్ ఆఫ్​ వర్చూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్​ వైస్) మంత్రిత్వ శాఖ” పేరిట కొత్త బోర్డుపెట్టారు. విమెన్స్ మినిస్ట్రీలోని మహిళా సిబ్బందిని సైతం ఉద్యోగాల నుంచి తీసేయడంతో వారు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 

డ్రోన్ దాడిపై సారీ చెప్పిన యూఎస్ కమాండర్ 

కాబూల్ లో ఐఎస్ టెర్రరిస్టుల వెహికల్ ను టార్గెట్ గా చేసుకుని ఆగస్టు 29న తాము జరిపిన డ్రోన్ దాడిలో ఏడుగురు చిన్నారులతో సహా 10 మంది పౌరులు చనిపోయారని యూఎస్ మిలిటరీ కమాండర్ జనరల్ ఫ్రాంక్ మెకింజీ ఎట్టకేలకు తప్పును ఒప్పుకొన్నారు. డ్రోన్ దాడి చేసిన వెంటనే పౌరులు చనిపోయారని వార్తలు వచ్చినా, అమెరికా ఖండించింది. డ్రోన్ దాడిలో చనిపోయిన వాళ్లకు టెర్రరిస్టులతో సంబంధంలేదని తాజా దర్యాప్తులో తేలింది. దీంతో ఫ్రాంక్ మెకింజీ తప్పును ఒప్పుకున్నరు. ‘ఆర్మీ కంబాటెంట్ కమాండర్​గా జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్తున్నా. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇస్తున్నా..” అని ఆయన మీడియా ముందు వెల్లడించారు.