వాషింగ్టన్: వాయుకాలుష్యంతో మహిళల ఎము కలు నాలుగు పదుల వయసులోనే గుల్లబారుతున్నాయి. ప్రధానంగా ‘పోస్ట్ మెనోపాజ్’ దశలో ఉన్నవారు దీనివల్ల ప్రభావితమవుతున్నారు. గాలిలో నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అనే కాలుష్య కారకాలు పెరిగిపోయాయని.. వీటివల్లే మహిళలకు ఆస్టియోపోరోసిస్ వచ్చి వెన్నెముక సమస్యలు తలెత్తుతున్నాయని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ సైంటిస్టుల స్టడీలో తేలింది. క్యాల్షియం సహా ఇతరత్రా మినరల్స్ తగ్గడంతో ఎముకల సాంద్రత తగ్గిపోతోందని గుర్తించారు.
పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్న 1,61,808 మంది మహిళల ఆరోగ్యంపై జరిపిన స్టడీలో ఈవివరాలు వెల్లడయ్యాయని స్టడీ రిపోర్ట్లో చెప్పారు. అమెరికాలో ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్న వారిలో 80 శాతం మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. పోస్ట్ మెనోపాజ్ దశలో శరీరంలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ మోతాదు తగ్గిపోతోందని, దీనివల్ల ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు ఆస్టియో పోరోసిస్ రిస్క్ను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈవివరాలతో కూడిన స్టడీ రిపోర్ట్ ‘ఈ–క్లినికల్ మెడిసిన్’ జర్నల్లో పబ్లిష్ అయింది. .
మెనోపాజ్ అంటే మహిళల్లో పీరియడ్స్ ఆగిపోయే దశ. సహజంగా 50 నుంచి 55 ఏళ్లలోపు మహిళల్లో ఈ దశ ప్రారంభమవుతుంది. వయసుకు సంబంధించిన కారణాలతో పాటు హార్మోన్ల విడుదలలో జరిగే మార్పుల వల్ల ఇది వస్తుంది. మెనోపాజ్ తర్వాత వచ్చే సమయాన్నే పోస్ట్ మెనోపాజ్ అంటారు. ఈ దశలో చాలామంది మహిళలకు పీరియడ్స్ రావు. అయితే కొందరిలో మెనోపాజ్ దశ తరహా లక్షణాలే ఇంకా కంటిన్యూ అవుతాయి.