
కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్కు చేదు అనుభవం ఎదురైంది. హంపీలో ఆయనపై పలువురు యువకులు దాడికి పాల్పడ్డారు. హంపీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సంగీత కచేరిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్ పై పాటలు పాడుతుండగా కొందరు యువకులు ఆయనపై వాటర్ బాటిల్ విసిరారు. అయితే ఖేర్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తన ప్రదర్శనను కొనసాగించారు. బాటిల్ విసిరిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నడ పాటలు పాడనందుకే వారు బాటిల్ విసిరారని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో హంపీ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.