- నాస్కామ్ చైర్మన్ రాజేష్ నంబియర్
న్యూఢిల్లీ : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీఓపీ) జాబ్స్ చేసేవారికి ముప్పు ఉందని నాస్కామ్ చైర్మన్ రాజేష్ నంబియర్ అంచనా వేస్తున్నారు. కాగ్నిజెంట్ ఇండియా బిజినెస్కి ఎండీగా కూడా చేస్తున్న ఆయన, సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవారు పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెప్పారు. బీపీఓ జాబ్లు ఏఐతో భర్తీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని పూణెలోని ఓ సెమినార్లో పేర్కొన్నారు. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) ఇండస్ట్రీ సైజ్ ప్రస్తుతం 48.9 బిలియన్ డాలర్ల (రూ.4 లక్షల కోట్ల) కు పెరిగిందని అన్నారు.
సాఫ్ట్వేర్ సర్వీసెస్ సెక్టార్లో వర్క్లో భాగంగా ఏఐ వాడలేకపోయే వారు తమ జాబ్ కోల్పోతారని నంబియర్ అంచనా వేశారు. కాగా, చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఏఐ స్కిల్స్పై ట్రెయినింగ్ ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. జనరేటివ్ ఏఐ ప్రభావం వైట్కాలర్ జాబ్స్ (ఆఫీసుల్లో చేసే ఉద్యోగాలు) పై ఎక్కువగా ఉంటుందని నంబియర్ పేర్కొన్నారు. ఇండస్ట్రీలోని కింది స్థాయిలోని ఉద్యోగాలు ఏఐతో భర్తీ అవుతాయని చెప్పారు. ‘బల్బులు రిపేర్ చేసే లేదా ఏసీలు బాగు చేసే జాబ్స్పై ఏఐ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, బ్రోకరేజి కంపెనీల్లో షేర్లను ఎనాలసిస్ చేసే లేదా అకౌంటెంట్ వంటి జాబ్స్ను మాత్రం ఏఐ భర్తీ చేస్తుంది’ అని వివరించారు. రానున్న 5–10 ఏళ్లలో జనరేటివ్ ఏఐ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్నారు.