- తాత్కాలికంగా నిలిపివేసిన బల్దియా అధికారులు
- బిల్ కలెక్టర్లకు ఇతర పనులు అప్పగింత
- మళ్లీ చేస్తారో.. లేదోనని దరఖాస్తుదారుల్లో టెన్షన్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లో కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల వెరిఫికేషన్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అధికారులు మొన్నటి వరకు దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి, అడ్రస్లలో లేనివారికి ఫోన్లు చేసి టెన్షన్ పెట్టారు. తాజాగా బిల్ కలెక్టర్లకు స్పెషల్ సమ్మరీ రివిజన్–2023కి సంబంధించి ఓటరు నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించిన పనులు అప్పగించడంతో వెరిఫికేషన్ ప్రాసెస్కు బ్రేక్ పడింది. వీటి తర్వాత బతుకమ్మ చీరల పంపిణీ షురూ అవుతుంది. ఆ పనులు కూడా బిల్కలెక్టర్లకే అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో వెరిఫికేషన్పూర్తయ్యేలా కనిపించడం లేదు.
మరోవైపు డబుల్బెడ్రూం ఇండ్లు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్న దరఖాస్తుదారుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న దరఖాస్తుదారుల నుంచి ఓటర్ కార్డు, ఇతర వివరాలు సేకరించారు. అందుబాటులో లేనివారికి ఫోన్లు చేసి తెప్పించుకున్నారు. సిబ్బంది రాకపోగా కనీసం ఫోన్లు కూడా చేయలేదని కొందరు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇండ్లు వస్తాయో లేవోనని అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు.
మాన్యువల్గా అప్లికేషన్లు కానొస్తలే
డబుల్బెడ్రూం ఇండ్ల కోసం ఆరేండ్ల కింద గ్రేటర్వ్యాప్తంగా 7.10లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ముందుగా కలెక్టరేట్లతోపాటు జీహెచ్ఎంసీ ఆఫీసులోనూ మాన్యువల్గా సేకరించారు. కుప్పలు కుప్పులుగా అప్లికేషన్లు వస్తుండడంతో అధికారులు మీసేవ ద్వారా అప్లయ్ చేసుకోవాలని సూచించారు. అయితే అప్పటికే లక్షకుపైగా అప్లికేషన్లు మాన్యువల్ గా వచ్చాయి. ఇప్పుడు అప్లికేషన్లు ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు. వెరిఫికేషన్ ప్రాసెస్లో అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. మాన్యువల్గా అప్లయ్ చేసిన వారికి ఇండ్లు వచ్చే అవకాశం లేదని కొందరు అధికారులు అంటున్నారు. బిల్కలెక్టర్లు కూడా ఇదే చెబుతున్నారు. ఇప్పటివరకు మీసేవ ద్వారా అప్లికేషన్లకు సంబంధించిన వివరాలు మాత్రమే సేకరించారు.