ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మందమర్రి ఏరియాకు మూడు అవార్డులు

మందమర్రి​,వెలుగు: మందమర్రి ఏరియా బొగ్గు గనులకు సింగరేణి స్థాయిలో మూడు అవార్డులు రావడం అభినందనీయమని ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్​చెప్పారు. సోమవారం స్థానిక జీఎం ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డులు సాధించిన బొగ్గు గనులకు సంబంధించిన ఆఫీసర్లు, ఎంప్లాయీస్​ను అభినందించారు. సింగరేణి డేలో ప్రకటించిన అవార్డుల్లో టెక్నాలజీలో బెస్ట్​ ఓసీపీగా ఆర్కేపీ నిలిచిందని, కేకే--1 గని బెస్ట్ ఎస్డీఎల్ మైన్​గా, ఏరియా స్వచ్ఛ పక్వాడలో రెండో ఉత్తమ ఏరియాగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో ఏరియా ఎస్​వోటు జీఎం సీహెచ్​ కృష్ణారావు, ఆర్కేపీ ఓసీపీ పీవో మధుసూదన్, డీజీఎం ఐఈడీ రాజన్న, కేకే1 గని మేనేజర్​ లక్ష్మీనారాయణ, పర్సనల్ హెచ్​వోడీ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి బీజేపీ సాయం

కుభీరు,వెలుగు: మండలంలోని అంతర్ని గ్రామానికి చెందిన రైతోళ్ల సుభాష్ ఇటీవల మృతి చెందగా సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భోస్లే మోహన్ రావు పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల కారణాలు తెలుకొని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేశారు. భవిష్యత్​లో పిల్లలను ఆదుకుంటానని భరోసా కల్పించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ సుభాష్, అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, కౌన్సిలర్ అల్లెం దిలీప్, తదితరులు ఉన్నారు.

బంగారిగూడ వాసులకు పట్టాలు ఇవ్వాలి

ఆదిలాబాద్/ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగుడా వాసులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లుగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఇల్లు కట్టుకొని నివాసముంటున్న పేదలకు పట్టాలు ఇవ్వకుండా, ఇంటి నంబర్లు కేటాయించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం, మున్సిపాలిటీ వారు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇంటి నంబర్లు కేటాయిస్తే ప్రభుత్వ సంక్షే మపథకాలు అందుతాయని, సౌకర్యాలు మెరుగుపడుతాయని పేర్కొన్నారు. సమావేశంలో లీడర్లు నగేశ్, లోక ప్రవీణ్ రెడ్డి, మయూర్ చంద్ర, మురళీధర్, రత్నాకర్ రెడ్డి, దత్త, మోరేశ్, రాకేశ్​తదితరులు ఉన్నారు.

జాతీయ బీసీ కమిషన్ చైర్మన్​ను కలిసిన లీడర్లు

జాతీయ బీసీ కమిషన్​ చైర్మన్,​చంద్రాపూర్​మాజీ ఎంపీ హంసరాజ్​ను సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో లీడర్లు ఆదినాథ్, అంకత్ రమేశ్, లోక ప్రవీణ్ రెడ్డి, నగేశ్, మయూర్ చంద్ర, విజయ్, రాజేశ్, శ్రీనివాస్, మహేందర్, మురళీధర్, రత్నాకర్ రెడ్డి మానాజీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

రైతు వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేస్తాం

నిర్మల్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా చేస్తున్నట్లు వెల్లడించారు. నిరసనకు రైతులు, ప్రజాసంఘాలు, యువకులు, పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సీఎం కేసీఆర్ ఉపాధి హామీ నిధులు  దారిమల్లించి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. 

ధరణి పోర్టల్ ను సమీక్షించి నష్టపోతున్న రైతులందరినీ ఆదుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రాంనాథ్, లోక్ సభ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ నాయుడు మురళి, జిల్లా ఉపాధ్యక్షుడు కమల్ నాయక్, అలివేలు మంగ, జిల్లా కార్యదర్శి గాదె విలాస్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు రజనీ వైద్య, టౌన్ ప్రెసిడెంట్ సాధం అర్వింద్​ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవం

మందమర్రి/బెల్లంపల్లి/ఇచ్చోడ,వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం సీపీఐ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మందమర్రిలో నిర్వహించిన వేడుకల్లో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్​ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు గనులను  ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నాయని మండిపడ్డారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్​, జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేశ్, భీమనాధుని సుదర్శనం, రేగుంట చంద్రశేఖర్, సలెంద్ర సత్యనారాయణ, ఇప్పకాయల లింగయ్య పాల్గొన్నారు. బెల్లంపల్లిలో పార్టీ నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్ పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ హాజరయ్యారు. రాష్ట్ర సమితి సభ్యులు చిప్ప నరసయ్య, బొల్లం పూర్ణిమ, టౌన్ సెక్రటరీ డీఆర్  శ్రీధర్, లీడర్లు గుండా చంద్ర మాణిక్యం, ఆడెపు రాజమౌళి, ఎల్తూరు శంకర్ పాల్గొన్నారు. ఇచ్చోడలో పార్టీ మండల కార్యదర్శి కల్లెపల్లి గంగయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నిమ్మల శివకుమార్ రెడ్డి, నరాల రమణయ్య, మండల కో కన్వీనర్ మచ్చ లక్ష్మణ్, రాజేశ్వర్ తుమ్మల, కొల్లూరు గంగారం, విలాస్, ఎల్లయ్య, దుబ్బాక, లక్ష్మణ్, జంగుబాబు పటేల్ పాల్గొన్నారు. 

ఆదిలాబాద్​లో పత్తి ధర ఢమాల్
రూ. 7500లకు డౌన్​

ఆదిలాబాద్, వెలుగు: పత్తి రైతులు మరోసారి మోసపోయారు. సీసీఐ రంగంలోకి దిగితే న్యాయం జరుగుతుందని ఆశించిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. మహారాష్ట్ర వ్యాపారులూ ఇక్కడి పత్తిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంలేదు. మొదట్లో రూ.8,300 మద్దతు ధర పలికిన క్వింటాల్​పత్తి ఇప్పుడు రూ.7 వేలకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో మండిపడుతున్నారు. వ్యాపారులు సిండింకేట్ గా మారి ధర తగ్గిస్తున్నా.. పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అయితే మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్  తెలిపారు. ఈ విషయమై మార్కెటింగ్​శాఖ ఏడీ శ్రీనివాస్​మాట్లాడుతూ అంతర్జాతీయంగా పత్తి బేల్ ధర తగ్గడంతోనే ధరలు పడిపోయాయన్నారు. మునుముందు మరింత ధర తగ్గే అవకాశం ఉందన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు

ఆసిఫాబాద్,వెలుగు: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని బీజేపీ ఆసిఫాబాద్  నియోజకవర్గ ఇన్​చార్జి అజ్మీర ఆత్మరామ్ నాయక్  చెప్పారు. సోమవారం మండలంలోని ఆడ గ్రామానికి చెందిన శంకర్ పటేల్, శ్యాంరావ్, విక్రమ్, సంపత్ మహారాజ్, మధు , పరమేశ్వర్​తో  పాటు 200 మంది బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజల సంక్షేమాన్ని ఇక్కడి ప్రజాప్రతినిధులు విస్మరించారని ఆరోపించారు. కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి సూర్య ప్రకాశ్  ,మండల అధ్యక్షుడు గణేశ్, లీడర్ బబ్లు తదితరులు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం

ఆసిఫాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి పేర్కొన్నారు. సోమవారం ఆసిఫాబాద్​లోని బీజేపీ ఆఫీస్​లో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కుంరం వందన అధ్యక్షతన నిర్వహించిన జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. రాష్ట్రపతి, ఆర్థిక శాఖమంత్రి పదవులు మహిళలకు ఇచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోడీకి దక్కిందన్నారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో’ నినాదంతో మహిళలకు ముందుకు తీసుకెళ్తున్న బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మహిళలపై ఉందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ చర్ల మురళి, ధోని శ్రీశైలం, కొట్నాక విజయ్ ​కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణకుమారి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అజ్మీర ఆత్మారాం నాయక్, పార్లమెంట్ కోకన్వీనర్ కొలిపాక కిరణ్, జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ కుసుమ విజయ, అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పదవి ముగిసినా శిలాఫలకాలపై పేర్లు ఎందుకు?

కుభీరు,వెలుగు: ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసినా శిలాఫలకాలపై పేర్లు ఎందుకు రాస్తారని బీజేపీ లీడర్లు ప్రశ్నించారు. సోమవారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. కుభీర్ వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​ పదవీ కాలం ముగిసిందని తెలిపారు. ఈనెల 23న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మౌల గ్రామానికి వచ్చి బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు రాయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పీఆర్​ డీఈని ఫోన్​లో సంప్రదించగా, చైర్మన్ పేరు రాయడం తప్పేనని, సరిచేస్తామని తెలిపారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో లీడర్లు జావిద్ ఖాన్, నాగేందర్, నాగేశ్, మల్లేశ్, నందు ఉన్నారు.