లండన్: బ్రిటన్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ వారంలోనే కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నట్లు కన్జర్వేటివ్ పార్టీ ప్రకటించింది. మరోసారి భారత సంతతికి చెందిన రిషి సునక్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు 100 మంది ఎంపీల మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. సంక్షోభం నుంచి దేశాన్ని గట్టేక్కించాలంటే మళ్లీ బోరిస్ జాన్సన్ కు అధికారం కట్టబెట్టాలనే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో బోరిస్ జాన్సన్ కూడా మళ్లీ రేసులోకి వచ్చారు.
కుటుంబంతో విహార యాత్రలో ఉన్న ఆయన హుటాహుటిన యూకేకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం బోరిస్ జాన్సన్ కు 45 మంది ఎంపీల బలం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా సభ్యుల మద్దతు కోసం ఆయన ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ సభ్యులను కోరుతున్నట్లు తెలుస్తోంది. పోటీలో ఉన్నట్లు అటు రిషి సునక్, ఇటు బోరిస్ జాన్సన్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని రేసులో ఎవరు ఉంటారనేది ఆసక్తిగా మారింది.