- మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో దారుణం
ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో పరువు హత్య జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకుందన్న కోపంతో కడుపుతో ఉందని కూడా చూడకుండా.. తల్లి సాయంతో సొంత అక్కను ఓ బాలుడు కొడవలితో నరికి చంపాడు. తలను మొండెం నుంచి వేరు చేసి చేతిలో పట్టుకొని చుట్టు పక్కల వారికి చూపించాడు. ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కూతురు(19), కొడుకు(17)తో కలిసి ఉంటోంది. ఈ ఏడాది జూన్లో కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితోనే కలిసి వైజాపూర్లో అత్తింటి వద్ద ఉంటోంది. ఈ విషయంలో కక్ష పెంచుకున్న సోదరుడు అక్కను చంపాలని తల్లితో కలిసి ప్లాన్ వేశాడు. అడ్రస్ తెలుసుకుని వెళ్లి పుట్టింటికి రమ్మంటూ కూతురును ఆ తల్లి కోరింది. ఆదివారం కొడుకుతో కలిసి మరోసారి వెళ్లింది. తల్లి, తమ్ముడి కోసం యువతి వంటింట్లో టీ చేస్తుండగా.. తమ్ముడు ఆమె వెనక నుంచి కొడవలితో దాడి చేశాడు. తల్లి ఆమె కాళ్లు పట్టుకోగా.. అతను నరికి చంపి, తలను వేరు చేశాడు. దాన్ని పట్టుకొని బయటకు వచ్చి చుట్టుపక్కల వారికి చూపెట్టాడు.
యువతి భర్తపైనా దాడికి యత్నం
వంట గది నుంచి వచ్చిన సప్పుడు విని ఆ యువతి భర్త వేరే గదిలో నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే అక్కను నరికి చంపిన నిందితుడు అతనిపైనాదాడికి ప్రయత్నించగా తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయినట్లు వీర్గాం పోలీసులు తెలిపారు. అయితే మొండెం నుంచి వేరు చేసిన తలతో బాలుడు, అతని తల్లి సెల్ఫీలు కూడా దిగి షేర్చేశారని పోలీసులు విచారణలో గుర్తించారు.