- సొంతూరు ఏనుగల్లులో 251/బీ సర్వే నంబర్ లో భూమి ఉన్నట్లు వెల్లడి
- ధరణిలో ఆ నంబర్ పై మరొక వ్యక్తి పేరిట 14 గుంటలు
- తన భార్య పేరుపై ఉన్న ల్యాండ్ వివరాల్లోనూ తప్పులు
- వినోద్ తండ్రి మురళీధర్ రావు పేరిట ధరణిలో 1.10 ఎకరాల ప్రభుత్వ భూమి నమోదు
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ తనది కాని భూమిని తన భూమిగా ఎన్నికల అఫిడవిట్లో చూపారు. తన భార్యకు చెందిన భూమితో పాటు తన కుటుంబ భూమి వివరాలను కూడా ఆయన తప్పుగా పొందుపరిచారు. వినోద్ కుమార్ తన సొంతూరైన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో తన ఉమ్మడి కుటుంబ ఆస్తిగా సర్వే నంబర్ 174, 175/ఏ, 251/బీ, 280/ఏ, 306, 307, 279/సీ, 274, 275/ఏ, 272/బీ, 273/ఏ, 282/బీ, 286/ఏలో 11.06 ఎకరాల డ్రై ల్యాండ్, 4-14 ఎకరాల వెట్ ల్యాండ్ ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో పేర్కొన్న 251/బీ సర్వే నంబర్లో వినోద్ కుమార్ కుటుంబానికి ఎలాంటి భూమి లేదు. ఆ నంబర్ పై అదే గ్రామానికి చెందిన అప్పని పెద్ద సాంబయ్యకు 14 గుంటల భూమి ఉన్నట్లు ధరణి రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ, ఈ సర్వే నంబర్ను వినోద్ తన భూమిగా అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే ధరణి రికార్డుల ప్రకారం ఏనుగల్లులోని సర్వే నంబర్ 286లో ఉన్న మొత్తం భూమే 1.15 ఎకరాలు. ఆ భూమి అంతా ధరణి రికార్డుల ప్రకారం నల్లపు నాగలక్ష్మిపేరిట చూపిస్తోంది. కానీ, వినోద్ తన అఫిడవిట్ లో 286/ఏలో తనకు భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. అసలు ధరణిలోనే లేని సర్వే నంబర్ లో భూమి ఉన్నట్లు వెల్లడించడం, ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వినోద్ తండ్రి పేరిట 1.10 ఎకరాల అసైన్డ్ భూమి
బోయిన్పల్లి వినోద్కుమార్ తండ్రి మురళీధర్ రావు పేరిట ఏనుగల్లులో 45.16 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.10 ఎకరాల గవర్నమెంట్/అసైన్డ్ భూమి కూడా ఆయన పేరిట నమోదు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏనుగల్లు గ్రామంలో 175/4 సర్వే నంబర్ లో 25 గుంటలు, 175/ఏ/4/1 సర్వే నంబర్లో మరో 25 గుంటలు కలిపి మొత్తం 1.10 ఎకరాల అసైన్డ్ భూమి మురళీధర్ రావు పేరిట చూపిస్తోంది. భూస్వామ్య కుటుంబానికి చెందిన ఆయనకు ల్యాండ్ ఎలా అసైన్ చేశారో అంతుబట్టని ప్రశ్నగా మారింది. ధరణిలో ఈ భూమిని నిషేధిత జాబితాలో చూపడం గమనార్హం.
వినోద్ భార్య మాధవి ల్యాండ్ వివరాల్లోనూ తప్పులు
వినోద్ కుమార్ తన భార్య మాధవి పేరిట రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో 2020 జులైలో 577 సర్వే నంబర్ లో 19.02 ఎకరాలు, అదే ఏడాది నవంబర్ లో 582వ సర్వే నంబర్ లో 13 గుంటలు, 579 సర్వే నంబర్లో 13 గుంటల భూమి కలిపి మొత్తం 19.28 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు చూపారు. కానీ, ధరణి పోర్టల్ లో మాధవి పేరిట 19.13 ఎకరాలు మాత్రమే నమోదైనట్లు చూపుతోంది. ఈ లెక్కన 15 గుంటల భూమి అఫిడవిట్లో ఎక్కువగా చూపినట్లు స్పష్టమవుతోంది.