ఫాదర్​ సెంటిమెంట్..కూతుళ్ల ప్రచారాస్త్రం .. కంటోన్మెంట్​లో ఆసక్తికర పోటీ

ఫాదర్​ సెంటిమెంట్..కూతుళ్ల ప్రచారాస్త్రం .. కంటోన్మెంట్​లో ఆసక్తికర పోటీ
  • బీఆర్ఎస్ నుంచి సాయన్న కూతురు లాస్యనందిత
  • కాంగ్రెస్ నుంచి గద్దర్ కుమార్తె వెన్నెల 
  • రెండు పార్టీల అభ్యర్థులు జనాల్లోకి వెళ్లి ప్రచారం 

కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్​ పరిధి కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్​, బీఆర్ఎస్ తరఫున ఇద్దరు ​ఆడబిడ్డలు సెంటిమెంట్​ను ప్రచారస్త్రంగా చేసుకుని ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్  ​నుంచి ప్రజా గాయకుడు గద్దర్​ కూతురు వెన్నెల, బీఆర్ఎస్ ​నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత పోటీ చేస్తున్నారు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. రెండు పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 25ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే సాయన్న ఆకస్మిక మృతితో ఆయన సెంటిమెంట్​ కూతురికి కలిసి వస్తుందనే ధీమాతో బీఆర్ఎస్​ టికెట్ ​కేటాయించింది. తన పాటలతో చైతన్య పరిచి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన  ప్రజా గాయకుడు గద్దర్ ​కూతురు వెన్నెలకు కాంగ్రెస్ టికెట్​ఇచ్చింది. 

ఎన్నికల నోటిఫికేషన్​కు ముందే ప్రచారం ..

5 సార్లు కంటోన్మెంట్​ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న ప్రజలకు సుపరిచితుడే కాదు, అవినీతిరహితుడు అనే పేరుపొందారు. అయితే, కంటోన్మెంట్ బోర్డు కేంద్ర పరిధిలో ఉన్నందున ఆయన చేపట్టిన అభివృద్ధి పెద్దగా కనిపించపోయినా ప్రజల్లో పేరున్న వ్యక్తి. ఈ సెంటిమెంట్​తోనే సాయన్న కూతురు లాస్య నందిత ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్​ రాకముందు నుంచే బీఆర్ఎస్​ అభ్యర్థి తన ప్రచారాన్ని చేపట్టగా.. కేవలం సాయన్న అనుచరులు మాత్రమే ఆమెతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. టికెట్​ఆశించి  భంగపడిన ఇతర గ్రూపుల నేతలు దూరంగానే ఉన్నారు. అసమ్మతి నేతలను బీఆర్ఎస్​ అధిష్టానం బుజ్జగించడంతో ఆమెతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నారు.

ఓటింగ్​ సమయానికి పరిస్థితులు ఎలా మారుతాయో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రజాగాయకుడు గద్దర్​ విప్లవ కారుడే కాదు, తన పాటలతో మాస్​ ఫాలోయింగ్​ తెచ్చుకున్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందిని చైతన్య పరిచారు. ఈసారి ఎన్నికల్లో తననే పార్టీ  పోటీకి దించాలని సిద్ధమవగా.. గత ఆగస్టులో ఆయన మృతిచెందాడు. దీన్ని దృష్టిలో  ఉంచుకుని ఆయన కూతురుకు కాంగ్రెస్​ టికెట్ కేటాయించింది.  తన తండ్రి సాయన్న ఈ నియోజకవర్గానికి సుపరిచితుడు అయినందున ఆయన సెంటిమెంట్​తో తనను గెలిపించాలని బీఆర్ఎస్​ అభ్యర్థి లాస్య నందిత ప్రజలను కోరుతున్నారు.

తెలంగాణ ఉద్యమంలో వేలాది మందిని  చైతన్య పరిచిన తన  తండ్రి గద్దర్​పై  ప్రజల్లో ఉన్న అభిమానం, సానుభూతి వర్కవుట్​అవుతుందనే భావనతో వెన్నెల ప్రచారం చేస్తున్నారు. రాష్ర్టం వచ్చాక బీఆర్ఎస్​ తన తండ్రిని పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్​ పార్టీ మాత్రం ఆయన త్యాగాలను గుర్తించి వారసురాలిగా తనకు టికెట్ కేటాయించిదని వెన్నెల చెప్పుకుంటున్నారు. ఇలా ఇద్దరు మహిళా అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికలకు కొత్త వారు. ఫాదర్ సెంటిమెంట్​తో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందేనని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.