న్యూఢిల్లీ వెలుగు: మతం మారిన దళితులకు ఎస్సీ హోదాను కొనసాగించాలని డిమాండ్ తో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో మాజీ సీజేఐ జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలోని జాతీయ విచారణ సంఘానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మేడె రాజీవ్ సాగర్లతో కూడిన బీఆర్ఎస్ నేతల బృందం వినతిపత్రం సమర్పించింది.
అనంతరం తెలంగాణ భవన్లో మాట్లాడిన నేతలు.. కేవలం మతం మారారనే నెపంతో సంక్షేమ పథకాలను నిలిపివేయడం సరికాదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 15, 17, 21, 25 ప్రకారం.. ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ, సమాన హక్కులు ఉన్నాయని గుర్తుచేశారు. దళిత క్రైస్తవులపై దాడులు జరుగుతుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీల 16 మంది ఎంపీలు నోరు మెదపకపోవడాన్ని తప్పుబడుతూ, హిట్లర్తో పోల్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని రవిచంద్ర విమర్శించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా దక్కే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు.
