సీఎం రేవంత్ రెడ్డి భాష అసహ్యంగా ఉంది : బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు

సీఎం రేవంత్ రెడ్డి భాష అసహ్యంగా ఉంది : బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు
  •     బీఆర్​ఎస్​ నేతల విమర్శలు
  •     ముఖ్యమంత్రి భాషఅంతా బూతులే : శ్రీనివాస్​ గౌడ్
  •     రేవంత్​ను దింపిన తర్వాతే..కేసీఆర్ ​పులిలా అసెంబ్లీకివస్తరు: జనార్దన్​ రెడ్డి
  •     సీఎం ​మాటలు విని పిల్లలు భయపడుతున్నరు: రసమయి

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డిపై బీఆర్​ఎస్​ మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు మూకుమ్మడి మాటల దాడికి దిగారు.బుధవారం కొడంగల్​లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్, కేటీఆర్​తీరుపై సీఎం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం బీఆర్​ఎస్​ సీనియర్​ లీడర్లు ప్రెస్​మీట్లు పెట్టి రేవంత్​రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్​భాష చూస్తే అసహ్యంగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. సర్పంచ్​ల సన్మాన సభలో బూతులు మాట్లాడి..కొత్త సర్పంచ్​లకు సీఎం ఏం సందేశం ఇవ్వాలనుకున్నారని నిలదీశారు. తొండలు, పేగులు అంటూ.. రేవంత్​ మొత్తం బూతు శాస్త్రమే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 

నాలుగు వేల గ్రామాల్లో సర్పంచులున్న బీఆర్​ఎస్​ పార్టీ ఎట్ల ఖతమవుతుందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ మాట్లాడుతూ.. సర్పంచ్​ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు ఎక్కువ సీట్లు రావడంతో సీఎం రేవంత్​ రెడ్డి ఆవేదన, ఆక్రోశం కొడంగల్​ మీటింగ్​తో బయటపడిందన్నారు. రేవంత్​ను సీఎం పదవి నుంచి దింపిన తర్వాతే.. కేసీఆర్​ పులిలా అసెంబ్లీకి వస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేక కేసీఆర్ పై రేవంత్​ బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఆరు గ్యారంటీలు అమలయ్యాయో చూపించాలన్నారు. ఆయన నిరూపిస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, రేవంత్​ను ఏకగ్రీవంగా ఎమ్మెల్యే చేస్తామని అన్నారు. 

కేసీఆర్​ గురించి ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రేవంత్​ మాటలు చూసి చిన్న పిల్లలు భయపడుతున్నారని, ప్రజలు వెక్కివెక్కి ఏడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. ఉద్యమ బుల్లెట్​ హరీశ్​ రావు అని, తెలంగాణ హీరో కేటీఆర్​ అని చెప్పారు. కేసీఆర్​ ప్రెస్​మీట్​పెట్టగానే.. రేవంత్​రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. హరీశ్​ రావు ఆరడుగుల బుల్లెట్​ అని, తెలంగాణ బాపు కేసీఆర్​అని ఆయన పేర్కొన్నారు.