మా స్కీమ్​లు అమలు చేస్తరా : ఉత్తమ్ కుమార్ రెడ్డి

మా స్కీమ్​లు అమలు చేస్తరా : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కరీంనగర్, వెలుగు :  ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వాళ్లు.. మహాలక్ష్మి స్కీమ్ కోసం అప్లై చేసుకోవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. కొత్త వాళ్లు మాత్రమే అప్లై చేసుకోవాలని, పాతోళ్లకు ఆటోమెటిక్​గా పాత పింఛనే వస్తదని స్పష్టం చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ ఈ సమాధానం ఇచ్చారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీనికి ఉత్తమ్​తో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గృహలక్ష్మి, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లపై సందేహాలు లేవనెత్తగా.. మంత్రి ఉత్తమ్ సమాధానం ఇచ్చారు. కల్యాణలక్ష్మి చెక్కులు ఇప్పటికే రెడీగా ఉన్నా.. ఆఫీసర్లు మాత్రం వాటిని పంపిణీ చేయడం లేదని, లబ్ధిదారులు తమ ఇంటి ముందుకొచ్చి కూర్చుంటున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. 

కలెక్టర్​లతో మాట్లాడి చెప్తామని ఉత్తమ్ సమాధానం ఇచ్చారు. గృహలక్ష్మి కింద రూ.3 లక్షలు మంజూరైన వారి పరిస్థితేంటని ఎమ్మెల్యే సంజయ్ ప్రశ్నించారు. దీనిపై ఉత్తమ్ స్పందిస్తూ.. ఇంటి నిర్మాణాలు ప్రారంభించిన వారి గురించి కేబినెట్​లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చివర్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. తాను మాట్లాడుతానంటూ కోరగా.. మొన్నటిదాకా మీరే మాట్లాడారు కదా’’అంటూ పొన్నం ప్రభాకర్ తన స్పీచ్ కంటిన్యూ చేశారు.