అణచివేత ధోరణిలో రేవంత్​ పాలన..బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ శ్రవణ్ ఫైర్​

అణచివేత ధోరణిలో రేవంత్​ పాలన..బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ శ్రవణ్ ఫైర్​

హైదరాబాద్, వెలుగు: అణచివేత ధోరణిలో సీఎం రేవంత్​ పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.​ ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ వాళ్లకి పరిపాలన చేతకాదని నాడు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారని.. కానీ, దేశమే గర్వపడేలా తెలంగాణను కేసీఆర్​అభివృద్ధి చేసి చూపించారని పేర్కొన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దళితబంధును ఆపేసింది.

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది. అందగత్తెలను చూసేందుకు 5 సార్లు అందాల పోటీలకు వెళ్లిన ముఖ్యమంత్రి.. ఒక్కసారి కూడా రైతులను పరామర్శించలేదు. వ్యవసాయం, విద్యుత్, నీటి రంగంలో విధ్వంసం జరుగుతున్నది’’ అని శ్రవణ్ ఆరోపించారు.