- అడ్డుకున్న పోలీసులు.. స్వల్ప ఉద్రిక్తత
- మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్శంకర్ ఇండ్ల ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి భారీగా చేరుకున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆందోళన చేపట్టిన జోగు రామన్నను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు
దీంతో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. పోలీసులు చెదరగొట్టడంతో పలువురు నాయకులు, కార్యకర్తలు గాయాలపాలయ్యారు. అనంతరం పోలీస్స్టేషన్ ముందు జోగు రామన్న పడుకొని నిరసన తెలిపారు. రంగు మారిన సోయా పంటను, తేమ లేకుండా పత్తి పంటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని తాము నిరసన చేపడితే పోలీసులు లాటీ చార్జ్చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతులపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
