కోస్గిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్..

కోస్గిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్..
  • కోస్గిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
  •  సర్జఖాన్ పేట్​లో ఇరుపార్టీల కార్యకర్తల ఘర్షణ  
  • పోలీసుల లాఠీచార్జ్​లో పలువురికి గాయాలు  

కోస్గి, వెలుగు: నారాయణపేట జిల్లా  కొస్గి మండలం సర్జఖాన్​పేట్​లో మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోమశేఖర్ రెడ్డి తన వాహనాల్లో ఓటర్లకు పంచేందుకు భారీగా డబ్బులు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ వెహికల్స్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సోమశేఖర్ వెంట ఉన్న వ్యక్తులు వాహనాల్లో ఉన్న కట్టెలు, రాడ్​లతో కాంగ్రెస్​ నాయకులను, కార్యకర్తలను తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకొని కోస్గి మండల కాంగ్రెస్ నాయకులు సర్జఖాన్​పేట్​కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది.

దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. లాఠీచార్జిలో పలువురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ నాయకుల తీరును నిరసిస్తూ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి కోస్గిలోని శివాజీ చౌక్​వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్​నేత రేవంత్​రెడ్డి అన్న తిరుపతిరెడ్డితో పాటు మరికొందరు లీడర్లు కోస్గికి చేరుకుని సుభాష్​చంద్రబోస్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు రాళ్ల రువ్వుకోవడంతో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.