- డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కు రూ.13,700 కోట్లు
- గగన్యాన్, ఆదిత్య ఎల్1, మిషన్ వీనస్ ప్రాజెక్టులపై ఫోకస్
- సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.14,217 కోట్లు
న్యూఢిల్లీ: మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈసారి బడ్జెట్లో రూ.14,217.46 కోట్లు అలాట్ అయ్యాయి. ఈ మొత్తాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు కేటాయిస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.6,000 కోట్లు అలాట్ అయ్యాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్, డెవలప్మెంట్ కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి రూ.2,581 కోట్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు రూ.5,636.46 కోట్లు కేటాయించారు. ఇక ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ చీఫ్గా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కు కూడా ఈసారి కేటాయింపులు పెరిగాయి. ఈ శాఖకు బడ్జెట్లో రూ.13,700 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.వెయ్యి కోట్లు ఎక్కువ. స్పేస్ మిషన్లకు ప్రోత్సాహం ఇచ్చేందుకుగానూ ఈ విభాగానికి కేటాయింపులను కేంద్రం ఈసారి భారీగా పెంచింది. మనదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్యాన్, ఆదిత్య ఎల్1, మిషన్ వీనస్ తదితర ప్రాజెక్టుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.