
- ఆన్లైన్ పోటీ తట్టుకోవడానికి మొబైల్ స్టోర్ల పండుగ ఆఫర్లు
వెలుగు బిజినెస్ డెస్క్: పండగల సీజన్లో మొబైల్ ఫోన్ కొనండి... కారో లేదా ఫ్లాటో గెలుచుకోండి... మొబైల్ ఫోన్లు అమ్మే షాపుల ఆఫర్లు ఇలా ఉంటున్నాయి. అమ్మకాలు లేకపోవడంతో మొబైల్ షాపుల యజమానులు ఈ పండగ సీజన్లో ఎలాగైనా కస్టమర్లను ఆకట్టుకోవాలని రకరకాల ఆఫర్లు ముందుకు తెస్తున్నారు. ఆన్లైన్ కంపెనీలతో పోటీ తట్టుకుని నిలబడేందుకు గిఫ్ట్ ఓచర్లు, జిమ్ మెంబర్షిప్లు, ఫ్రీ కాస్మెటిక్ లేజర్ ట్రీట్మెంట్, ఫ్రీ కార్ సర్వీస్ లాంటి ఆఫర్లు చేస్తున్నారు. కరోనా మూడో వేవ్ భయంతోనే కొన్ని పెద్ద ఆఫర్లూ తెస్తున్నారు. మూడో వేవ్ వస్తే ఎక్కువ మంది కస్టమర్లు ఆన్లైన్ చానెల్స్లోనే కొంటారని వారు భయపడుతున్నారు. అహ్మదాబాద్లోని మొబైల్ రిటెయిల్ షాపుల వాళ్లందరూ కలిసి డబ్బు పోగేసి, రూ. 25 లక్షల లక్కీ డ్రా ప్రైజును ప్రకటించారు. అంతేకాదు, వారు సేలన్లు, జిమ్లతో టై అప్ పెట్టుకున్నారు. షాపులో కొనే కస్టమర్లకు 8 నుంచి 10 ఓచర్లుండే ఒక ఎన్వెలప్ కవర్ను ఇస్తారు. కార్ వాష్ సర్వీస్, పార్లర్లో లేజర్ రిమూవల్, ఒక నెల ఫ్రీ జిమ్ మెంబర్ షిప్ వంటి ఆఫర్లు అందులో ఉంటాయని ఆల్ ఇండియా మొబైల్ రిటెయిలర్స్ అసోసియేషన్ ఆఫ్ గుజరాత్ప్రెసిడెంట్ నికుంజ్ పటేల్ చెప్పారు. పటేల్కు ఫోన్బుక్ పేరుతో మొత్తం 45 రిటెయిల్ స్టోర్లున్నాయి. తాము ఇచ్చే ఆఫర్లతో బిజినెస్ పెరుగుతుందని ఆయన ఆశిస్తున్నారు. కొత్తగా లాంఛైన కొన్ని ఫోన్లను ఆన్లైన్లో కొందామనుకున్న కస్టమర్లు కూడా ఈ ఆఫర్లకు ఆకర్షితమై తమ షాపులకు వచ్చినట్లు పటేల్ పేర్కొన్నారు.
ఆన్లైన్లోనే స్మార్ట్ఫోన్లు..
కరోనా రాకతో మొబైల్ ఫోన్ల ఆన్లైన్, ఆఫ్లైన్ అమ్మకాలు ఇంచుమించుగా సమానమయిపోయాయి. చాలా మంది కస్టమర్లు తప్పనిసరి పరిస్థితులలో ఆన్లైన్లో కొనడానికి మారాల్సి వచ్చింది. దాంతో రెండు ఛానెళ్ల సేల్స్ ఒకే స్థాయికి చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో మొబైల్ఫోన్ల అమ్మకాలు ఎక్కువగా ఆన్లైన్లోనే జరిగినట్లు ఐడీసీ ఇటీవలే తన రిపోర్టులో వెల్లడించింది. దాంతో ఆన్లైన్ అమ్మకాల వాటా 51 శాతానికి చేరింది. అంతకు ముందుతో పోలిస్తే ఆన్లైన్ అమ్మకాలు ఏకంగా 113 శాతం పెరిగినట్లు. 2019 ఏప్రిల్–జూన్ క్వార్టర్లో చూస్తే స్మార్ట్ఫోన్ సేల్స్లో ఆన్లైన్ వాటా 37 శాతమైతే, రిటెయిల్ షాపుల సేల్స్ వాటా 63 శాతంగా ఉండేదని ఐడీసీ రిపోర్టు పేర్కొంది. గతంలో ఆఫర్లతో ఊదరగొట్టిన ఆన్లైన్ ఛానెల్స్ను అలాంటి ఆఫర్లతోనే దెబ్బకొట్టాలని మొబైల్ ఫోన్ల రిటెయిలర్లు కొన్ని గంటలలోనే హోమ్ డెలివరీ వంటి సర్వీసులతో ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్–జూన్ క్వార్టర్లో మొబైల్ ఫోన్లకు డిమాండ్ కొంత తగ్గినప్పటికీ, ఆ తర్వాత కొంత పుంజుకుంది. సేల్స్ ఎలా ఉండబోతున్నాయనే అంచనాలకు దీపావళి పండగ ముందు నెలల్లోని అమ్మకాలే ఆధారంగా నిలుస్తాయి. పండగ సీజన్లో ప్రతిసారి ఆఫర్లు ఉంటాయని, కాకపోతే ఈ సారి మరింత ఎక్కువగా ఆఫర్లు ఉన్నాయని రిటెయిలర్లు చెబుతున్నారు. ఏడాది మొత్తంలో సాగే మొబైల్ ఫోన్ల అమ్మకాలలో మూడో వంతు పండగ సీజన్లోనే జరగడం దీనికి రుజువంటున్నారు.
భవిష్యత్లో ఇలాంటి ఆఫర్లు హైదరాబాద్లోనూ..!
మహారాష్ట్రలోని రిటెయిలర్లు కూడా మంచి ఆఫర్లు ప్లాన్ చేస్తున్నారని, లక్కీ డ్రా విన్నర్ ఒక ఫ్లాట్ లేదా ఒక కారు గెలుచుకోవచ్చని ఏఐఎంఆర్ఏ ప్రెసిడెంట్ అజిత్ జగ్తాప్ చెప్పారు. మాకు వెబ్సైట్లు లేవు. రిటెయిలర్లంతా కలిసి జమ చేసే మొత్తాన్నిబట్టే అడ్వర్టయిజ్మెంట్లు కూడా ఉంటాయి. కానీ, కస్టమర్లు రోజంతా ఫోన్లలో ఆన్లైన్ ఆఫర్లను చూస్తూ, తమకు కావాల్సిన వాటిని ఎంపిక చేసుకుంటున్నారని ఉత్తరప్రదేశ్లోని మొబైల్ రిటెయిలర్ ఒకరు చెప్పారు. ఇలాంటి ఆఫర్లు హైదరాబాద్లో ఇంకా తేకపోయినా, తెచ్చే అవకాశాలను తోసిపుచ్చలేము. ఈ పండగల సీజన్లో అమ్మకాలు పెంచుకోవడానికి మన రాష్ట్రంలోని మొబైల్ స్టోర్లు కూడా ఊరించే ఆఫర్లు తెస్తాయని ఆశించొచ్చు.