
కోపెన్హాగెన్: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్స్లో గోల్డ్పై గురి పెట్టిన ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి అందుకు తొలి అడుగు వేశారు. మెగా టోర్నీలో శుభారంభం చేసి ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు. విమెన్స్ డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ జంట కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో బై దక్కించుకొని టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్ సాత్విక్–చిరాగ్ జంట బుధవారం జరిగిన మెన్స్ డబుల్స్ రెండో రౌండ్లో 21–16, 21–9తో కెనెత్ జె హూయి–మింగ్ చుయెన్ లిమ్ (ఆస్ట్రేలియా)ను చిత్తు చేసింది. వరుస గేమ్స్లో 30 నిమిషాల్లోనే ఆసీస్ ద్వయం ఆట కట్టించింది.
తొలి గేమ్ స్టార్టింగ్లోనే 7–3తో ఆధిక్యంలోకి వెళ్లిన సాత్విక్–చిరాగ్ దాన్ని కొనసాగిస్తూ బ్యాక్లైన్ రిటర్న్తో గేమ్ సొంతం చేసుకుంది. రెండో గేమ్లో 4–4తో స్కోరు సమం అయిన తర్వాత ఇండియా జోడీ ఒక్కసారిగా సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. నెట్ వద్ద ఫాస్ట్గా ఆడటంతో పాటు పదునైన స్మాష్లు కొట్టి ఆరు పాయింట్ల లీడ్తో బ్రేక్కు వెళ్లింది. అదే ఊపుతో ఈజీగా మ్యాచ్ సొంతం చేసుకుంది. ప్రిక్వార్టర్స్లో సాత్విక్–చిరాగ్ జంట ఇండోనేసియాకు చెందిన పదో సీడ్ లీయో రాలీ కార్నాండో–డానియెల్ మార్టిన్తో పోటీ పడనుంది.
మరోవైపు విమెన్స్ డబుల్స్ రెండో రౌండ్లో 19వ ర్యాంకర్ గాయత్రి–ట్రీసా 21–18, 21–10తో చాంగ్ చింగ్ హు– యాంగ్ చిన్ టున్పై వరుస సెట్లలో గెలిచింది.ప్రిక్వార్టర్స్లో ఇండియా యంగ్స్టర్స్ చైనాకు చెందిన టాప్ సీడ్ చెన్ క్వింగ్ చెన్- –జియ యి ఫన్తో అమీతుమీ తేల్చుకుంటారు.