జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కాటారం - మహదేవపూర్ 353వ జాతీయ రహదారిపై ఇసుక లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. నస్తూర్ పల్లి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మహదేవపూర్ వైపు నుంచి కాటారం వైపు వస్తున్న ఇసుక లారీ... కాటారం వైపు నుంచి కాళేశ్వరం వైపు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రేగొండ మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బాధితుల్లో సబ్బిడి సురేందర్ రెడ్డి అనే వ్యక్తికి అత్యంత తీవ్రమైన గాయాలైనట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు.. 108 వాహనంలో క్షతగాత్రులను ముందుగా మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
