న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత కారణంగా ఆటో కంపెనీల బిజినెస్ దెబ్బతింటూనే ఉంది. గత నెల కూడా మెజారిటీ కంపెనీల సేల్స్ పడిపోయాయి. మారుతి, హ్యుండై అమ్మకాలు రెండంకెల మేర తగ్గాయి. గత అక్టోబర్తో పోలిస్తే కియా ఇండియా, హోండా కార్స్ , ఎంజీ మోటార్ డిస్పాచ్లు కూడా తగ్గాయి. అయితే, టాటా మోటార్స్, మహీంద్రా, నిస్సాన్, స్కోడా వంటి కంపెనీలూ సప్లై చెయిన్ సమస్యలను ఎదుర్కొన్నప్పటికి ప్రొడక్షన్ను, సేల్స్ను పెంచుకున్నాయి. మారుతీ సుజుకి ఇండియా డొమెస్టిక్ సేల్స్ గత అక్టోబరుతో పోలిస్తే ఈ అక్టోబరులో 32 శాతం తగ్గాయి. 2020 అక్టోబర్లో 1,72,862 యూనిట్లను అమ్మగా, ఈసారి 1,17,013 యూనిట్లను మాత్రమే డీలర్లకు పంపగలిగింది. హ్యుండై మోటార్ ఇండియా డొమెస్టిక్ సేల్స్ 35 శాతం పడ్డాయి. ఈ అక్టోబరులో 37,021 యూనిట్లను అమ్మగా, కిందటి అక్టోబర్లో డీలర్లకు 56,605 యూనిట్లను అందజేసింది. కియా ఇండియా హోల్సేల్స్ 22 శాతం తగ్గి 16,331 యూనిట్లకు చేరుకున్నాయి. హోండా కార్స్ అమ్మకాలు 25 శాతం తగ్గి 8,108 యూనిట్లకు పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా తన అమ్మకాలను 8 శాతం పెంచుకుంది. ఈసారి 20,130 యూనిట్లను డిస్పాచ్ చేసింది.
టాటా సేల్స్ పెరిగినయ్..
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 44 శాతం పెరిగాయి. ఇది గత నెల 33,925 యూనిట్లను డీలర్లకు పంపించింది. నిస్సాన్ ఇండియా సేల్స్ మూడు రెట్లు పెరిగి 3,913 యూనిట్లకు చేరుకున్నాయి. స్కోడా అమ్మకాలు అక్టోబర్లో రెండు రెట్లు పెరిగి 3,065 యూనిట్లకు చేరుకున్నాయి. టూవీలర్ల విభాగాన్ని చూస్తే టీవీఎస్ మోటార్ కంపెనీ గత నెల 2,58,777 యూనిట్లను అమ్మింది. సుజుకీ మోటార్సైకిల్ సేల్స్ 67,225 నుండి 56,785 యూనిట్లకు తగ్గాయి. బజాజ్ ఆటో సేల్స్ 22 శాతం పడిపోయాయి. గత నెలలో 2,18,565 యూనిట్లను అమ్మగలిగింది.