న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా తగ్గుతూనే ఉన్న ఆటోమొబైల్ అమ్మకాలు సెప్టెంబరులోనూ నిరాశపర్చాయి. పండగ సీజన్ మొదలైనప్పటికీ అమ్మకాలు పుంజుకోలేదు. టూవీలర్, ట్రాక్టర్ కంపెనీల పరిస్థితి మాత్రం కాస్త మెరుగుపడింది. టాప్–-6 ఆటో కంపెనీల అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులోనూ 34 శాతం తగ్గాయి. 2018 ఆగస్టులో 2.60 లక్షల యూనిట్లు అమ్మితే, ఈసారి వీటి సంఖ్య 1.71 లక్షలకు తగ్గింది. ఇండియాలోనే అతిపెద్ద వెహికిల్ కంపెనీ మారుతీ సుజుకీ డిమాండ్ లేక మూడు ప్లాంట్లలో ప్రొడక్షన్ను 39 శాతం వరకు తగ్గించింది. వరుసగా ఏడు నెలలుగా డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మరికొన్ని కంపెనీలు కూడా ప్లాంట్లను మూసివేసి, కాంట్రాక్టు కార్మికులను ఇంటికి పంపించాయి. దేశవ్యాప్తంగా వెహికిల్ షోరూమ్ల డీలర్లు దాదాపు 20 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని సియామ్ వంటి సంస్థలు తెలిపాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత మంది ఉద్యోగాలు పోకతప్పదని హెచ్చరించాయి. వాహన ధరలు తగ్గితే అమ్మకాలు పెరుగుతాయి కాబట్టి వీటిపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని పలుసార్లు కేంద్రమంత్రులను కోరాయి. జీఎస్టీ మండలి మాత్రం ఈ వినతిని తోసిపుచ్చింది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబరులోనూ ఆటో కంపెనీలు డీలా పడ్డాయి.
మారుతీ సుజుకీ
మనదేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా సేల్స్ సెప్టెంబరులో 24.4 శాతం తగ్గి 1,22,640 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ కంపెనీ గత ఏడాది ఇదే నెలలో 1.62 లక్షల యూనిట్లను అమ్మింది. దేశీయంగా అమ్మకాలు 26.7 శాతం తగ్గి 1,12,500 యూనిట్లుగా రికార్డయ్యాయి. వేగన్ ఆర్, ఆల్టో, స్విఫ్ట్, సెలేరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ అమ్మకాలు పతనమయ్యాయి. ఎగుమతుల్లో17.8 శాతం తగ్గుదల రికార్డయింది.
బజాజ్ ఆటో
బజాజ్ ఆటో కూడా నిరాశపర్చింది. ఈ కంపెనీ అమ్మకాలు గత నెల 20 శాతం తగ్గి 4,02,035 యూనిట్లుగా నమోదయ్యాయి. బజాజ్ గత ఏడాది ఇదే నెలలో 5,02,009 యూనిట్లను అమ్మింది. మనదేశంలో అమ్మకాలు (డొమెస్టిక్ అమ్మకాలు) 31 శాతం తగ్గి 2,15,501 యూనిట్లుగా రికార్డయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 3.11 లక్షల యూనిట్లను అమ్మింది. బైకుల అమ్మకాలు కూడా 22 శాతం క్షీణించాయి. కమర్షియల్ వెహికిల్స్ సేల్ ఎనిమిది శాతం పడిపోయాయి. మరో టూవీలర్ కంపెనీ టీవీఎస్ అమ్మకాలు తొమ్మిదిశాతం పెరిగాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 21 శాతం తగ్గాయి. ఇవి గత నెల 21 శాతం తగ్గి 43,343 యూనిట్లకు చేరాయి. 2018 సెప్టెంబరు నెలలో ఇది 55 వేల యూనిట్లను అమ్మింది. దేశీయ మార్కెట్లో అమ్మకాలు 21 శాతం తగ్గి 40,692 యూనిట్లుగా రికార్డయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 51,268 యూనిట్లను అమ్మింది. ఎగుమతులు 29 శాతం తగ్గి 2,651 యూనిట్లకు పడిపోయాయి. ప్యాసింజర్ సెగ్మెంట్ సేల్స్ 33 శాతం, కమర్షియల్ వెహికిల్స్ అమ్మకాలు 18 శాతం పడిపోయాయి. పండగ సమయం కాబట్టి ఇక నుంచి అమ్మకాలు పుంజుకుంటాయని కంపెనీ సీనియర్ ఆఫీసర్ విజయ్ రామ్ నక్రా అన్నారు.
మహీంద్రా ట్రాక్టర్ల విభాగం
మహీంద్రా ట్రాక్టర్ల అమ్మకాలు ఫర్వాలేదనిపించాయి. ఇవి గత నెల రెండు శాతం తగ్గి 37 వేల యూనిట్లకు చేరాయి. గత ఏడాది సెప్టెంబరు నెలలో 37,581 యూనిట్లు అమ్ముడయ్యాయి. డొమెస్టిక్ మార్కెట్ అమ్మకాల్లో పెద్దగా మార్పు కనిపించలేదు.
అశోక్ లేలాండ్
హిందుజా గ్రూపునకు చెందిన అశోక్ లేలాండ్ కంపెనీ వాణిజ్య వాహన అమ్మకాలు గత నెల 55 శాతం తగ్గి 8,780 యూనిట్లుగా రికార్డు అయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 19,374 యూనిట్లను అమ్మింది. మనదేశ మార్కెట్లో అమ్మకాలు 56.57 శాతం తగ్గి 7,851 యూనిట్లుగా రికార్డయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 18,078 యూనిట్లను అమ్మగలిగామని కంపెనీ తెలిపింది. మీడియం, హెవీ, లైట్ సెగ్మెంట్లలో అమ్మకాలు పడిపోయాయి.
టొయోటా కిర్లోస్కర్
టొమోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం) అమ్మకాలు గత నెలలో 17 శాతం తగ్గి 10,911 యూనిట్లకు చేరాయి. 2018 సెప్టెంబరు నెలలో ఇది 13 వేల యూనిట్లను అమ్మింది. దేశీయ మార్కెట్లో అమ్మకాలు 18 శాతం తగ్గి 10,203 యూనిట్లుగా రికార్డయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 12,512 యూనిట్లను అమ్మింది. ఇక ఎగుమతులు 25 శాతం తగ్గి 566 యూనిట్లకు పడిపోయాయి. కస్టమర్ సెంటిమెంట్ బలహీనంగా ఉండటమే ఈ పరిస్థితి కారణమని టీకేంఎం డిప్యూటీ ఎండీ ఎన్.రాజా అన్నారు.
ఎస్కార్ట్ ట్రాక్టర్స్
ఎస్కార్ట్ ట్రాక్టర్ల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. ఇవి గత నెల 2.2 శాతం పెరిగి 10,855 వేల యూనిట్లకు చేరాయి. గత ఏడాది సెప్టెంబరు నెలలో 10,617 యూనిట్లు అమ్ముడయ్యాయి. డొమెస్టిక్ మార్కెట్ అమ్మకాల్లో 1.2 శాతం పెరుగుదల కనిపించింది. ఎగమతులు 51.1 శాతం పెరిగి 334 యూనిట్లకు చేరాయని కంపెనీ తెలిపింది.