మ్యూచువల్ ఫండ్లకు డబ్బే డబ్బు.. 10 నెలల్లో రూ.51,399 కోట్ల సేకరణ

మ్యూచువల్ ఫండ్లకు డబ్బే డబ్బు.. 10 నెలల్లో  రూ.51,399 కోట్ల సేకరణ

న్యూఢిల్లీ : మనదేశంలోని మ్యూచువల్ ఫండ్స్​ ఈ సంవత్సరం మొదటి పది నెలల్లో 142 కొత్త ఫండ్ ఆఫర్ల (ఎన్​ఎఫ్​ఓలు) ద్వారా రూ.51,399 కోట్లను సేకరించాయి.  ఐపీఓల్లో కంటే  ఫండ్స్​లోనే జనం ఎక్కువ డబ్బును గుమ్మరించారు. ఈక్విటీ ఎన్ఎఫ్ఓల్లో థీమాటిక్,  మల్టీ-క్యాప్ ఫండ్స్​కు ఆదరణ ఎక్కువగా ఉంది. ఈక్విటీ ఫండ్స్​కు రూ.28,429 కోట్లు వచ్చాయి. ప్రైమరీ మార్కెట్ లోనే కాదు మ్యూచువల్ ఫండ్ హౌసుల్లోనూ కాసుల వర్షం కురుస్తోంది. కొత్త ఫండ్ ఆఫర్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ సేకరించిన మొత్తం భారీగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఈ ఏడాది మొదటి పది నెలల్లో భారీ మొత్తంలో రూ.51,399 కోట్లను సేకరించగా, ఐపీఓల ద్వారా కంపెనీలు దాదాపు రూ.32,200 కోట్లు సేకరించాయి. ఆసక్తికర సంగతి ఏంటంటే.. ఈ సంవత్సరం పూర్తయిన 40 ఐపీఓలలో 10 మాత్రమే రూ.1,000 కోట్లకు పైగా విలువైనవి ఉన్నాయి.  అయితే, ఈక్విటీ మార్కెట్లలో బుల్ రన్ కారణంగా ఈక్విటీ కొత్త ఫండ్ ఆఫర్లలోకి భారీగా డబ్బు వచ్చి చేరుతోంది. సెప్టెంబర్ క్వార్టర్​లో అత్యధికంగా రూ.10,516 కోట్లు వచ్చాయి. ఎస్​బీఐ మ్యూచువల్ ఫండ్,  కోటక్ మహీంద్రా ఏఎంసీ తమ డివిడెండ్ ఈల్డ్​, మల్టిపుల్ అసెట్లో అలోకేషన్​ ఫండ్ ద్వారా ఒక్కొక్కటి రూ.3,600 కోట్లు సేకరించాయి. ఈక్విటీ ఆఫర్లలో 22 ఎన్​ఎఫ్​ఓలు థీమాటిక్​ ఫండ్ల ద్వారా రూ.12,372 కోట్లను రాబట్టుకున్నాయి. ఐదు ఫ్లెక్సీ-క్యాప్,  ఆరు మల్టీ-క్యాప్ ఫండ్స్​వరుసగా రూ.2,478 కోట్లు , రూ.7,220 కోట్లు సేకరించాయి.   బీఎన్​పీ పారిబాస్ స్మాల్ క్యాప్ ఎన్​ఎఫ్​ఓ రూ.1,103 కోట్లను సమీకరించింది. ఎడల్వీస్​ మల్టీ-క్యాప్ రూ.975 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. బుల్లిష్​ ఈక్విటీ మార్కెట్​ కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్​మరింత బలపడిందని మనీ మేటర్ అడ్వైజర్స్ సీఈవో సిద్ధార్థ్ చవాన్ అన్నారు. మార్చి క్వార్టర్​లో   నాలుగు కంపెనీలు కేవలం రూ.880 కోట్లను సేకరించగా, అదే కాలంలో మ్యూచువల్ ఫండ్స్ 57 ఎన్​ఎఫ్​ఓల ద్వారా రూ.20,173 కోట్లు పెట్టుబడి పెట్టాయని ఆయన తెలిపారు.

హైబ్రిడ్  కేటగిరీ కూడా

హైబ్రిడ్ ఎన్ఎఫ్ఓలు కూడా బాగా అమ్ముడయ్యాయి.  డెట్ ఫండ్ల నుంచి భారీగా పెట్టుబడులను రాబట్టాయి. సెప్టెంబర్ క్వార్టర్​లోనే రూ.7,480 కోట్ల ఇన్‌‌ఫ్లోతో హైబ్రిడ్ కేటగిరీలోని ఎన్ఎఫ్ఓలు రూ.9,684 కోట్లు సమీకరించాయి. ఈక్విటీ మార్కెట్లు బుల్లిష్​గా ఉన్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్​ డెట్ ఫండ్ ఎన్​ఎఫ్​ఓల ద్వారా రూ.9,863 కోట్లను సేకరించగలిగాయి. మార్చి,  సెప్టెంబర్ క్వార్టర్లలో వరుసగా రూ.6,061 కోట్లు,  రూ.3,602 కోట్ల  ఇన్‌‌ఫ్లో వచ్చింది. విదేశీ పెట్టుబడి నిధులతో సహా పాసివ్​ ఫండ్స్​ ఎన్​ఎఫ్​ఓ సమయంలో రూ.3,287 కోట్ల పెట్టుబడిని పొందాయి.