
న్యూఢిల్లీ : మనదేశంలోని మ్యూచువల్ ఫండ్స్ ఈ సంవత్సరం మొదటి పది నెలల్లో 142 కొత్త ఫండ్ ఆఫర్ల (ఎన్ఎఫ్ఓలు) ద్వారా రూ.51,399 కోట్లను సేకరించాయి. ఐపీఓల్లో కంటే ఫండ్స్లోనే జనం ఎక్కువ డబ్బును గుమ్మరించారు. ఈక్విటీ ఎన్ఎఫ్ఓల్లో థీమాటిక్, మల్టీ-క్యాప్ ఫండ్స్కు ఆదరణ ఎక్కువగా ఉంది. ఈక్విటీ ఫండ్స్కు రూ.28,429 కోట్లు వచ్చాయి. ప్రైమరీ మార్కెట్ లోనే కాదు మ్యూచువల్ ఫండ్ హౌసుల్లోనూ కాసుల వర్షం కురుస్తోంది. కొత్త ఫండ్ ఆఫర్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ సేకరించిన మొత్తం భారీగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఈ ఏడాది మొదటి పది నెలల్లో భారీ మొత్తంలో రూ.51,399 కోట్లను సేకరించగా, ఐపీఓల ద్వారా కంపెనీలు దాదాపు రూ.32,200 కోట్లు సేకరించాయి. ఆసక్తికర సంగతి ఏంటంటే.. ఈ సంవత్సరం పూర్తయిన 40 ఐపీఓలలో 10 మాత్రమే రూ.1,000 కోట్లకు పైగా విలువైనవి ఉన్నాయి. అయితే, ఈక్విటీ మార్కెట్లలో బుల్ రన్ కారణంగా ఈక్విటీ కొత్త ఫండ్ ఆఫర్లలోకి భారీగా డబ్బు వచ్చి చేరుతోంది. సెప్టెంబర్ క్వార్టర్లో అత్యధికంగా రూ.10,516 కోట్లు వచ్చాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, కోటక్ మహీంద్రా ఏఎంసీ తమ డివిడెండ్ ఈల్డ్, మల్టిపుల్ అసెట్లో అలోకేషన్ ఫండ్ ద్వారా ఒక్కొక్కటి రూ.3,600 కోట్లు సేకరించాయి. ఈక్విటీ ఆఫర్లలో 22 ఎన్ఎఫ్ఓలు థీమాటిక్ ఫండ్ల ద్వారా రూ.12,372 కోట్లను రాబట్టుకున్నాయి. ఐదు ఫ్లెక్సీ-క్యాప్, ఆరు మల్టీ-క్యాప్ ఫండ్స్వరుసగా రూ.2,478 కోట్లు , రూ.7,220 కోట్లు సేకరించాయి. బీఎన్పీ పారిబాస్ స్మాల్ క్యాప్ ఎన్ఎఫ్ఓ రూ.1,103 కోట్లను సమీకరించింది. ఎడల్వీస్ మల్టీ-క్యాప్ రూ.975 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. బుల్లిష్ ఈక్విటీ మార్కెట్ కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్మరింత బలపడిందని మనీ మేటర్ అడ్వైజర్స్ సీఈవో సిద్ధార్థ్ చవాన్ అన్నారు. మార్చి క్వార్టర్లో నాలుగు కంపెనీలు కేవలం రూ.880 కోట్లను సేకరించగా, అదే కాలంలో మ్యూచువల్ ఫండ్స్ 57 ఎన్ఎఫ్ఓల ద్వారా రూ.20,173 కోట్లు పెట్టుబడి పెట్టాయని ఆయన తెలిపారు.
హైబ్రిడ్ కేటగిరీ కూడా
హైబ్రిడ్ ఎన్ఎఫ్ఓలు కూడా బాగా అమ్ముడయ్యాయి. డెట్ ఫండ్ల నుంచి భారీగా పెట్టుబడులను రాబట్టాయి. సెప్టెంబర్ క్వార్టర్లోనే రూ.7,480 కోట్ల ఇన్ఫ్లోతో హైబ్రిడ్ కేటగిరీలోని ఎన్ఎఫ్ఓలు రూ.9,684 కోట్లు సమీకరించాయి. ఈక్విటీ మార్కెట్లు బుల్లిష్గా ఉన్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్ డెట్ ఫండ్ ఎన్ఎఫ్ఓల ద్వారా రూ.9,863 కోట్లను సేకరించగలిగాయి. మార్చి, సెప్టెంబర్ క్వార్టర్లలో వరుసగా రూ.6,061 కోట్లు, రూ.3,602 కోట్ల ఇన్ఫ్లో వచ్చింది. విదేశీ పెట్టుబడి నిధులతో సహా పాసివ్ ఫండ్స్ ఎన్ఎఫ్ఓ సమయంలో రూ.3,287 కోట్ల పెట్టుబడిని పొందాయి.