2019లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించిన రెండు కేసులను సీబీఐ మూసివేసింది. రెండు కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో రెండేళ్ల తరువాత కేసును క్లోజ్ చేస్తున్నట్లు తెలిపింది. 2019 ఐపీఎల్ సీజన్ లో బెట్టింగ్ జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ 7 మందిపై కేసులు నమోదు చేసింది.
మొదటి ఎఫ్ఐఆర్లో ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన దిలీప్ కుమార్, హైదరాబాద్కు చెందిన గుర్రం వాసు, గుర్రం సతీష్లను నిందితులుగా ప్రస్తావించింది. రెండో ఎఫ్ఐఆర్లో రాజస్థాన్కు చెందిన సజ్జన్ సింగ్, ప్రభు లాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్ శర్మలను నిందితులుగా పేర్కొంది.
దాదాపు రెండేళ్లపాటు విచారణ జరిపినా, వారిపై ప్రాసిక్యూషన్ను కొనసాగించేందుకు సీబీఐకి తగిన ఆధారాలు లభించలేదు. దీంతో సీబీఐ డిసెంబర్ 23న ప్రత్యేక కోర్టులో మూసివేత నివేదికను దాఖలు చేసింది, దీనిలో ఆరోపణలపై వివరణాత్మక వర్ణనను అందించింది.. కేసును మూసివేయాలని సిఫారసు చేయడానికి కారణాలను పేర్కొంది. ఏజెన్సీ దాఖలు చేసిన నివేదికను ఆమోదించాలా లేక తదుపరి దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించాలా అనేది ఇప్పుడు కోర్టుపై ఆధారపడి ఉంటుంది.