జగన్ బెయిల్ పిటిషన్ కేసు విచారణ వాయిదా

 జగన్ బెయిల్ పిటిషన్ కేసు విచారణ వాయిదా

అమరావతి: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం  ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీకే చెందిన నరసాపురం ఎంపీ  రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ వాయిదాకు ఇదే చివరి సారి అంటూ సీబీఐ కోర్టు మందలించి బుధవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టు తీవ్రంగా మందలించిన నేపధ్యంలో కోర్టు విచారణపై ఉత్కంఠ ఏర్పడింది. అయితే లాక్‌డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామని జగన్ తరపు న్యాయవాదులు తెలియజేశారు. సీబీఐ నుంచి తమకు ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని...జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.