- పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ జోక్యంతో రైతులకు ఊరట
కోల్బెల్ట్, వెలుగు: సీసీఐ పత్తి కొనుగోళ్ల గడువు ఈ నెలాఖరు వరకు పెంచుతున్నట్టు ఆ సంస్థ ఆఫీసర్లు శనివారం ప్రకటించారు. పత్తి కొనుగోళ్లు ఈ నెల 20తో ముగిసినట్టు ఆఫీసర్లు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సీఎండీతో మాట్లాడారు. ముఖ్యంగా చెన్నూరు, కోటపల్లి మండలాల పరిధిలో పత్తి అమ్మకానికి సిద్ధంగా ఉన్న రైతులు కొనుగోళ్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. పంట దిగుబడి ఇంకా చివరి దశకు చేరుకోలేదని, పత్తి తీసే దశలోనే ఉందని వివరిస్తూ ప్రొక్యూర్మెంట్ గడువును పొడిగించాలని కోరారు.
ఎంపీ విజ్ఞప్తితో సానుకూలంగా స్పందించిన అధికారులు కొనుగోళ్లను మరో ఏడు రోజులు పొడిగించనున్నట్టు ప్రకటించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకరావాలని ఎంపీ వంశీకృష్ణ సూచించారు. సీసీఐ పత్తి కొనుగోళ్ల గడువు పొడిగింపు కోసం కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
