
హైదరాబాద్, వెలుగు: సెల్సియస్ లాజిస్టిక్స్ మంగళవారం ఫార్మాస్యూటికల్ సప్లై చైన్ నిర్వహణకు ప్రత్యేకమైన లాజిస్టిక్స్ విభాగం సెల్సియస్ ప్లస్ ప్రారంభించింది. ఉష్ణోగ్రత నియంత్రణ, నిబంధనలు పాటించటం, రియల్-టైమ్ విజిబిలిటీకి సంబంధించిన కఠినమైన అవసరాలను తీర్చేందుకు దీనిని ప్రారంభించామని తెలిపింది. ఇది మందులు, టీకాలు ఇతర సున్నితమైన ఫార్మా ఉత్పత్తులను సురక్షితంగా రవాణా చేస్తుంది.
ఈ విభాగం కోసం సెల్సియస్ ప్రారంభంలో రూ. 50 కోట్లు పెట్టుబడి పెట్టింది. 18 నెలల్లో ఈ విభాగం నుంచి రూ. 100 కోట్ల ఆన్యువల్ రికరింగ్ రెవెన్యూ (ఏఆర్ఆర్) సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడిలో రూ. 35 కోట్లు భారతదేశంలోని ప్రధాన ఫార్మాస్యూటికల్ కారిడార్లలో 100 కొత్త రీఫర్ వాహనాలను మోహరించడానికి కేటాయిస్తామని సెల్సియస్లాజిస్టిక్స్సీఈఓ స్వరూప్ బోస్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 600 నగరాలకు సేవలను అందిస్తామని, త్వరలో వీటి సంఖ్యను వెయ్యికి పెంచుతామని ప్రకటించారు.