రామాయణ థీమ్‍ పార్కు, క్రాఫ్ట్ ​విలేజ్​కు గ్రీన్ సిగ్నల్

రామాయణ థీమ్‍ పార్కు, క్రాఫ్ట్ ​విలేజ్​కు గ్రీన్ సిగ్నల్
  • 92.04 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
  • పార్కుకు రూ.13.88 కోట్లు 
  • ప్రకటించిన  మంత్రి కిషన్​రెడ్డి

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో రామాయణం థీమ్‍ పార్కుకు సెంట్రల్​ గవర్నమెంట్ ఓకే చెప్పింది. ఈ మేరకు టూరిజం శాఖ మంత్రి కిషన్‍రెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ప్రసాద్‍ ఫండ్స్​ నుంచి రూ.92.04 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. ఇందులో క్రాఫ్ట్ విలేజ్, రామాయణం థీమ్ పార్కుకు రూ.13.88 కోట్లు ఇవ్వనున్నారు.  2003లో గోదావరి పుష్కరాల తర్వాత రామాయణం థీమ్‍పార్కు నిర్మాణం కోసం ప్రపోజల్స్​ రెడీ చేయగా, 2013లో ఏపీటీడీసీ థీమ్‍పార్కుకు రూ.2 కోట్లు కేటాయించింది.

విభజనతో పనులకు బ్రేక్​ 
రాష్ట్ర విభజనకు ముందు థీమ్‍పార్కు కోసం భద్రాచలం టౌన్‍లోని శ్రీరామ్‍నగర్‍కాలనీలో 11.71 ఎకరాలను కేటాయించారు. ఏపీటీడీసీ  థీమ్‍పార్కుతో పాటు ట్రైబల్​ హబ్ నిర్మాణానికి పనులు మొదలుపెట్టింది. దీని కోసం కడప నుంచి సాండ్‍స్టోన్‍ కూడా తెప్పించారు. ఇంతలోనే రాష్ట్ర విభజన జరిగి పార్కు నిర్మాణ ప్రదేశమైన శ్రీరామ్‍నగర్‍కాలనీ ఆంధ్రాలోకి వెళ్లిపోయింది. దీంతో పనులు మూలకు పడ్డాయి.  

కరకట్ట, ఆర్​అండ్​బీ ఆఫీసు దగ్గర.. 
రామాయణం థీమ్‍పార్కు, క్రాఫ్ట్ విలేజ్ కోసం సెంట్రల్​ గవర్నమెంట్​ ఫండ్స్​ కేటాయించడంతో రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వంతెన వద్ద ఉన్న కరకట్ట దగ్గర రెండు నుంచి మూడెకరాలు, ఆర్‍అండ్‍బీ ఆఫీస్​దగ్గర ఆరెకరాలు పార్కు, విలేజ్ ​కోసం కేటాయించనున్నారు. భక్తులు టౌన్‍లోకి ప్రవేశించగానే చక్కటి అనుభూతి కల్పించేలా ఈ రామాయణ థీమ్​ పార్కు, విలేజ్​ క్రాఫ్ట్​ నిర్మాణాలు ఉండేలా ప్లాన్​ చేస్తున్నారు. రామాయణంలోని ఘట్టాలు భక్తులకు కళ్లకు కట్టేలా ఈ పార్క్ ఉండనుంది. 

రామయ్యకు వెండి చెంబు, కమండలం  
భద్రాద్రి రాముడికి హైదరాబాద్​కు చెందిన ధూళిపాల విజయరాంప్రసాద్‍, సరళ దంపతులు శుక్రవారం వెండి చెంబు, కమండలం అందజేశారు. 340 గ్రామలు వెండితో రూ.30,116 ఖర్చు పెట్టి వీటిని తయారు చేయించారు.