రాష్ట్రం తీరుపై కేంద్రం అసంతృప్తి

రాష్ట్రం తీరుపై కేంద్రం అసంతృప్తి
  •     రాష్ట్రం తీరుపై కేంద్రం అసంతృప్తి   
  •     100% కేంద్ర నిధులతో  5 ఆర్వోబీలు మంజూరు  
  •     నిర్మాణంలో జాప్యంపై కేంద్రానికి  బండి సంజయ్ లేఖ
  •     త్వరగా పూర్తి చేయాలంటూ రాష్ట్రానికి కేంద్రం లెటర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలుచోట్ల రైల్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం పట్ల కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధులు మంజూరై ఆరు నెలలు దాటినా పనుల్లో పురోగతి లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. జాతీయ రహదారులు, రవాణా శాఖ రీజనల్ అధికారి ఎస్.కె.కుశ్వాహా ఈ మేరకు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి ఆర్వోబీ సహా రాష్ట్రవ్యాప్తంగా 5 ఆర్వోబీల నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలుపుతూ గత నవంబర్లోనే రూ. 432.84 కోట్లు  మంజూరు చేసింది. నిధులు మంజూరై 6 నెలలు దాటినా ఇంతవరకు నిర్మాణ పనుల్లో పురోగతి లేకపోవడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ నెల 11న కేంద్రానికి లేఖ రాశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని తీగలగుట్ట సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) నిర్మాణంలో జాప్యం వల్ల స్థానిక ప్రజల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడిందన్నారు. తొందరగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేదన్నారు. హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, వికారాబాద్ లలో మంజూరైన ఆర్వోబీల నిర్మాణంలోనూ పురోగతి లేదని తెలిపారు. ఇచ్చిన గడువు ప్రకారం బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పనులను స్పీడప్ చేయాలంటూ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. 

కేంద్ర నిధులతో ఐదు ఆర్వోబీలు.. 

తీగలగుట్టపల్లి రైల్వే లైన్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణం కోసం బండి సంజయ్ ఎంపీ అయినప్పటి నుండి తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇందుకోసం రైల్వే మంత్రితోపాటు, రైల్వే బోర్డు చైర్మన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సహా ఉన్నతాధికారులందరినీ కలిసి ప్రతిపాదనలు అందించారు. సంజయ్ విజ్ఞప్తి మేరకు ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ ఓకే చెప్పింది. ఇందులో భాగంగా రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య 2020లోనే ఒప్పందం కుదిరింది. రాష్ట్రం 80%, కేంద్రం 20% నిధులు ఖర్చు చేసేందుకు అంగీకరించాయి. ఆర్వోబీకి రూ. 100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రాష్ట్రం తన వాటా కింద రూ. 80 కోట్లు చెల్లించాలని కేంద్రం లేఖ రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. ఈ మొత్తాన్ని తాము చెల్లించలేమని, ఆర్వోబీ నిర్మాణాల విషయంలో కేంద్రం తెచ్చిన కొత్త పాలసీనే అమలు చేయాలంటూ మెలిక పెట్టింది. దీంతో సంజయ్ విజ్ఞప్తి మేరకు కేంద్రం ‘సేతు భారతం’ ప్రాజెక్టు కింద 100 శాతం నిధులతో 5 ఆర్వోబీల నిర్మాణానికి ఆమోదం తెలిపి, గత నవంబర్లోనే నిధులు మంజూరు చేసింది. అయినా, ఇప్పటికీ పనుల్లో పురోగతి లేకపోవడంతో కేంద్రం అసహనం వ్యక్తం చేస్తూ లేఖ రాసింది.