- ఎన్డీఎస్ఏ కమిటీకి చెప్పిన సెంట్రల్ డిజైన్స్ ఆఫీస్ అధికారులు
- అన్నారం, సుందిళ్ల డిజైన్లు మాత్రమే తాము చేశామని వెల్లడి
- అన్నారం, సుందిళ్ల డిజైన్లు మాత్రమే చేశామని వెల్లడి
- మేడిగడ్డ డిజైన్ ఇచ్చింది తాము కాదన్న ఎల్ అండ్ టీ
- అప్పటి సర్కారు డిజైన్ల ప్రకారమే నిర్మించామని వివరణ
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి డిజైన్ చేసింది ఎల్ అండ్ టీ సంస్థేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీకి సెంట్రల్ డిజైన్స్ ఆఫీస్ (సీడీవో) అధికారులు చెప్పారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మాత్రమే తాము డిజైన్లు చేసినట్టు వివరించారు. ఇండియన్ స్టాండర్డ్ కోడ్ (ఐఎస్ కోడ్) ప్రకారమే బ్యారేజీలకు డిజైన్లు చేశామని కమిటీకి సీడీవో అధికారులు వివరించారు.
చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ గురువారం రెండో రోజు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అధికారులను ఒక్కొక్కరిని పిలిచి వివరాలు సేకరించింది. సీడీవో అధికారులు, నిర్మాణ సంస్థలు ఎల్ అండ్ టీ, నవయుగ, వ్యాప్కోస్, అఫ్కాన్స్ సంస్థల నుంచి వివరాలు తీసుకున్నది. ఉదయం 9.30 నుంచి రాత్రి 10 వరకు దాదాపు 12.30 గంటల పాటు మారథాన్ విచారణ చేపట్టింది.
మేడిగడ్డ డిజైన్లను ఎల్ అండ్ టీ సంస్థనే ఇచ్చిందని నిపుణుల కమిటీకి సీడీవో అధికారులు చెప్పినా.. తాము చేయలేదని ఎల్అండ్టీ స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన డిజైన్, డ్రాయింగ్ల ప్రకారమే తాము బ్యారేజీ నిర్మాణం చేపట్టామని తెలిపినట్టు సమాచారం. మేడిగడ్డ డ్యామేజీలకు తాము బాధ్యులం కాదని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి ఎల్ అండ్ టీ స్పష్టం చేసినట్టు తెలిసింది.
కాగా, బ్యారేజీలకు డిజైన్లు ఎవరు చేశారు? ఫీల్డ్కు వెళ్లారా? ఏ మోడల్ ప్రకారం డిజైన్లు రూపొందించారు? లాంటి ప్రశ్నలను సీడీవో అధికారులకు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సంధించినట్టు తెలిసింది. ఐఎస్ కోడ్ ప్రకారం బ్యారేజీలను డిజైన్ చేశామని, ఫీల్డ్కు వెళ్లే అధికారం తమకు లేదని సీడీవో అధికారులు వివరించినట్టు తెలిసింది. ఆ డిజైన్లను ఇవ్వాల్సిందిగా కమిటీ అడగ్గా.. వాటిని విజిలెన్స్ అధికారులు తీసుకెళ్లారని, ప్రస్తుతం తమ వద్ద ఆ డిజైన్లు లేవని సీడీవో అధికారులు చెప్పినట్టు తెలిసింది.
ఎల్ అండ్ టీ సంస్థ వద్దనున్న డిజైన్లను తీసుకుని నిపుణుల కమిటీకి ఇచ్చినట్టు సమాచారం. డిజైన్లకు సంబంధించి 9 రకాల అంశాలను తాము చెప్పిన ఫార్మాట్లో ఇవ్వాల్సిందిగా కమిటీ ఆదేశించినట్టు తెలిసింది. కాగా, ఓ అండ్ ఎం (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) డిపార్ట్మెంట్తో గురువారం మీటింగ్ జరగాల్సి ఉన్నా.. సమయాభావం వల్ల శుక్రవారానికి వాయిదా వేశారు.
బ్యారేజీల ఆపరేషన్ ప్రొటోకాల్పై ఆరా
బ్యారేజీల ఆపరేషనల్ ప్రొటోకాల్పైనా ఎన్డీఎస్ఏ కమిటీ ఆరా తీసినట్టు తెలిసింది. వర్షాకాలం సీజన్కు ముందు.. సీజన్ తర్వాత చేపట్టిన ఆపరేషన్ ప్రొటోకాల్ వివరాలను చెప్పాల్సిందిగా అధికారులను ప్రశ్నించినట్టు సమాచారం. ఆయా సందర్భాల్లో గుర్తించిన అంశాలేంటో చెప్పాలని వారిని అడిగినట్లు తెలిసింది. మేజర్ సమస్యలేమైనా గుర్తిస్తే.. వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ప్రశ్నించినట్టు తెలిసింది. కన్స్ట్రక్షన్కు ముందు తీసుకున్న చర్యలేంటి? ఏ టెస్టులు చేశారు? అని నిర్మాణ సంస్థలను కమిటీ నిపుణులు ప్రశ్నించినట్టు తెలిసింది. క్వాలిటీ నిర్ధారణ ఎలా చేశారు? ఎన్ని శాంపిళ్లను సేకరించారు? లాంటి వివరాలను రాబట్టినట్టు తెలుస్తున్నది. కాగా, ఓ అండ్ ఎంకు సంబంధించి 2019 నుంచి ఇప్పటిదాకా ఉన్న రిపోర్టులను కమిటీ అడిగినట్టు తెలిసింది.
ఇవాళ ఓ అండ్ ఎం, ఎస్డీఎస్ఓతో సమావేశం
ఓ అండ్ ఎం అధికారులతో గురువారమే మీటింగ్ జరగాల్సి ఉన్నా.. సీడీవో, నిర్మాణ సంస్థల నుంచి వివరాలను తీసుకునేటప్పటికే లేట్ నైట్ కావడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం ఓ అండ్ ఎం అధికారుల నుంచి మెయింటెనెన్స్కు సంబంధించిన వివరాలను తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. వారితో పాటు క్వాలిటీ కంట్రోల్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారులతో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించనున్నది. అనంతరం మధ్యాహ్నం రాజేంద్రనగర్లోని ఇంజనీరింగ్ రిసెర్చ్ ల్యాబ్కు వెళ్లి ప్రాజెక్టుల రన్నింగ్ మోడల్స్పై అధ్యయనం చేయనున్నది.