న్యూఢిల్లీ: దేశంలో తయారీని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం ఓ కొత్త పాలసీతో ముందుకు రానుంది. ఇండస్ట్రియల్ పాలసీ–2022 ని తీసుకొచ్చి పరిశ్రమలకు తక్కువ వడ్డీకే ఆర్థికంగా చేయూతనివ్వనుంది. మేడిన్ ఇండియా బ్రాండ్ను ప్రమోట్ చేయడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశమని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) చెబుతోంది.
ప్రస్తుతం ఈ పాలసీ డ్రాఫ్ట్ పేపర్లు రివ్యూ కోసం వివిధ మినిస్ట్రీల దగ్గరకు వెళ్లాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ పాలసీ కింద ఓ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని అన్నారు. ఇందుకోసం ఫారెక్స్ రిజర్వ్లలోని కొంత వాటాను వాడుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వివరించారు. ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా దేశంలో పరిశ్రమల ఎకోసిస్టమ్ను మెరుగుపరచడం, కంపెనీలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ పాలసీ అందుబాటులోకి వస్తే ఇది మూడో ఇండస్ట్రియల్ పాలసీ అవుతుంది.
గతంలో 1956 లో, 1991 లో ఇండస్ట్రియల్ పాలసీలను ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఈ పాలసీని తయారు చేసేటప్పుడు ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. పరిశ్రమల్లో పోటీతత్వాన్ని, సామర్ధ్యాన్ని పెంచడం, కంపెనీలను గ్లోబల్ వాల్యూ చెయిన్లో భాగస్వామ్యం చేయడం, ఇన్వెస్ట్మెంట్లకు డెస్టినేషన్గా ఇండియాను మార్చడం, ఇన్నోవేషన్స్ను, ఎంటర్ప్రెనూర్షిప్ను మెరుగుపరచడం, గ్లోబల్ స్టాండర్డ్స్ను అందుకోవడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ పాలసీ ద్వారా పెర్ఫార్మెన్స్ బట్టి చిన్న పరిశ్రమలకు లోన్లు ఇవ్వడం, ప్రోత్సాహాకాలు అందించడం వంటివి చేస్తారు. అంతేకాకుండా ఇన్నోవేటివ్, పర్యావరణానికి హాని చేయకుండా ఎదుగుతున్న కంపెనీలను గుర్తించి ప్రోత్సాహాకాలు ఇస్తారు.