
- ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 8 గ్రామాల ఎంపిక
- అత్యధికంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న గ్రామానికి రూ.కోటి ఇవ్వనున్న కేంద్రం
- సబ్సిడీతో యూనిట్ల ఏర్పాటు
ములుగు, వెలుగు : సౌర విద్యుత్ వినియోగంలో ముందుండే గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. ఇది మోడల్ సోలార్ విలేజ్ పథకంలో భాగంగా ఇండ్ల పైకప్పులపై సౌర ఫలకాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. ఈ పథకం కింద, ఎక్కువ సౌర విద్యుత్ను ఉపయోగించే గ్రామాలకు నజరానా లభిస్తుంది. విద్యుత్వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో పాలకులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వినియోగానికి ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని సహజసిద్ధ వనరులను వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో టీజీ రెడ్కో సంస్థ ద్వారా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (పీఎంఎస్జా ఎంబీవై) పథకాన్ని అమలు చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తోంది. ఎన్నికల కోడ్కు ముందు ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు సహకారం అందించారు.
ములుగు జిల్లాలో 8 గ్రామాలు ఎంపిక..
ములుగు జిల్లాలో 8 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సోలార్ప్యానెల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ములుగు జిల్లా కేంద్రంతోపాటు వెంకటాపూర్, గోవిందరావుపేట మండల కేంద్రాలతోపాటు పస్రా, చల్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలంలోని కమలాపురం, వెంకటాపురం గ్రామాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ గ్రామాలను ఎంపిక చేశారు. గత మేలో ఈ స్కీం జిల్లాలో విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 400కుపైగా సోలార్ప్యానెల్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం.
ఎక్కువ ప్యానెల్స్ఉన్న విలేజీకి రూ.కోటి నజరానా..
విద్యుత్ వినియోగదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.200ల యూనిట్ల వరకు సబ్సిడీ అమలు చేస్తోంది. అయితే నెలకు రూ.2 వేలకు పైగా విద్యుత్ బిల్లులు వచ్చే వారికి ఈ సోలార్ప్యానెల్ ఉపయోగకరంగా ఉంటుంది. రెడ్కో సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం కల్పిస్తుండగా ఒకటి, రెండు, మూడు కిలో వాట్విద్యుత్ వినియోగదారులకు ఎక్కువగా ఉపయోగం ఉంటుంది.
కిలో వాట్ సోలార్ప్యానెల్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు రూ.30 వేల సబ్సిడీ, 2 కిలో వాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యం గల పరికరం కోసం రూ.60 వేలు, 3 కిలో వాట్ల వినియోగదారులకు రూ.78 వేల సబ్సిడీ ఉంటుంది. ఇందు కోసం వంద నుంచి మూడు వందల చదరపు అడుగుల భవన రూఫ్ అవసరం ఉంటుంది. బిల్డింగ్ఉన్నవారికి అయితే సక్రమంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ములుగు జిల్లాలో ఎంపిక చేసిన 8 గ్రామాల్లో ఎక్కువ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న గ్రామాన్ని గుర్తించి రూ.కోటి నజరానా అందించనున్నారు.
ఆన్లైన్ లో దరఖాస్తు..
సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వినియోగదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://pmsuryaghar.gov.in పోర్టల్ లో లాగిన్ అయ్యి ఇంటికి సంబంధించిన యూఎస్సీ నంబర్ ను ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి. దీని ద్వారా ఎంత కిలో వాట్పరికరాలు అవసరమో వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం రెడ్కో సంస్థ ప్రతినిధులు, విద్యుత్శాఖ అధికారులు పరిశీలించి యూనిట్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తారు.
ప్రత్యేకమైన మీటర్ను ఏర్పాటు చేసి నెలనెలా వచ్చే విద్యుత్ బిల్లులో సోలార్ విద్యుత్, పవర్ ద్వారా వచ్చే విద్యుత్ ఏ మేరకు వినియోగించారో లెక్కించి బిల్ ఇస్తారు. ఒకవేళ సోలార్ ద్వారా ఎక్కువ యూనిట్లు ఉత్పత్తి చేస్తే ఆ విద్యుత్ ఎన్పీడీసీఎల్కు విక్రయించడం ద్వారా వినియోగదారుడు సొమ్ము చేసుకోవచ్చు.