
బిజినెస్ డెస్క్, వెలుగు: పేదవాళ్లు, బలహీన వర్గాలకు చెందిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో ఓ స్కీమ్ను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అర్హులైనవారిని గుర్తించే పనిలో ప్రభుత్వం ఉందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. దీంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలకు మెరుగులుదిద్ది మరింత సమర్ధవంతంగా పనిచేసేలా చేయనుందని అన్నారు. ఈ కొత్త సంక్షేమ పథకాన్ని రూపొందించడం చివరి దశలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలూ ఆసక్తి చూపించాక అమలు చేయనున్నారని చెప్పారు. రానున్న బడ్జెట్లో ఈ స్కీమ్కు సంబంధించిన విషయాలు తెలియొచ్చన్నారు. కరోనా వలన నిరుద్యోగం పెరిగిన విషయం తెలిసిందే. హెల్త్ ఖర్చులు బాగా పెరిగాయి. పేదవాళ్లు, వలస కూలీలు, పొలాల్లో పనిచేసేవారు, అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్కు చెందిన వర్కర్లు కరోనా సంక్షోభం వలన ఎక్కువగా నష్టపోయారు. దీంతో వీరి కోసం ఓ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ను తీసుకు రావాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది. కాగా, ఈ కొత్త స్కీమ్కు సంబంధించి ఫైనాన్స్ మినిస్ట్రీ, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలు స్పందించలేదని మింట్ పేర్కొంది.
తాజాగా తెచ్చిన కొన్ని స్కీమ్లు..
బలహీన వర్గాలు, పేదవాళ్ల కోసం తాజాగా కొన్ని స్కీమ్లను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 60 ఏళ్లు దాటిన వారి కోసం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) పేరుతో పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చింది. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పేరుతో ఏడాదికి కేవలం రూ. 12 ప్రీమియంతోనే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ను తీసుకొచ్చింది. అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కోసం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. రైతుల కోసం వివిధ సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. 60 ఏళ్లు దాటిన తర్వాత నుంచి నెలకు రూ. 3,000 ఫిక్స్డ్ పెన్షన్ను చిన్న రైతులకు అందించేందుకు ప్రధాన్ మంత్రి కిసాన్ పెన్షన్ యోజనను తీసుకొచ్చింది. పీఎం–కిసాన్ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ప్రతీ ఏడాది రూ. 6 వేలు ఇస్తోంది. ఈ స్కీమ్ కింద మొత్తం 14.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారని అంచనా. కొత్తగా తీసుకొచ్చే సంక్షేమ పథకం కూడా పీఎం–కిసాన్కు పోలి ఉంటుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. కరోనా సంక్షోభం వలన ఆదాయ మార్గాలను కోల్పోయిన వారికి ఈ స్కీమ్ సాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు ఇన్ఫార్మల్ వర్కర్ల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను మెరుగుపరచాలని ప్రభుత్వం చూస్తోంది. నెలవారీ కంట్రిబ్యూషన్ అమౌంట్ను తగ్గించడం, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజిని అందించడం వంటివి చేసి ఈ స్కీమ్లను మరింత ఆకర్షణీయంగా మార్చాలనుకుంటోంది. ఇన్ఫార్మల్ సెక్టార్లలోని వర్కర్లు ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ను ఎంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా కొన్ని బెనిఫిట్స్ను కూడా అందించనున్నాయని సంబంధిత వ్యక్తులు అన్నారు. ఈ సంక్షేమ పథకాల్లో రాష్ట్రాలు కూడా తమ వాటాను పెంచే అవకాశం ఉందని చెప్పారు.
ఈ‑శ్రమ్ పోర్టల్తో 23 కోట్ల మంది వర్కర్ల డేటా..
కరోనా లాక్డౌన్ టైమ్లో ఎక్కువగా నష్టపోయింది వలస కూలీలే. వీరికి సంబంధించిన పూర్తి డేటా లేకపోవడంతో ఈ వలస కూలీలకు రిలీఫ్ చర్యలను అందించడంలో ప్రభుత్వం వెనుకబడింది. అందుకే ఇన్ఫార్మల్ సెక్టార్లలోని వర్కర్ల డేటాను సేకరించడం వేగవంతం చేసింది. కిందటేడాది ఆగస్ట్లో ఈ–శ్రమ్ పోర్టల్ను ప్రభుత్వం లాంచ్ చేసింది. అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్లోని వర్కర్లు, వలస కూలీలు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, గిగ్ వర్కర్ల కోసం ఈ పోర్టల్ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 23 కోట్ల మంది వర్కర్లు ఈ–శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యారని ప్రభుత్వం చెబుతోంది. వీరి ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటి డిటైల్స్ను రిజిస్ట్రేషన్ టైమ్లో తీసుకుంటున్నారు. ఈ డేటాతో సరియైన స్కీమ్లను తీసుకురావడానికి వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. చిన్న, మధ్య తరహా బిజినెస్లపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. వీరికి అండగా ఉండడానికి కేంద్రం కొల్లటేరల్ లేకుండానే వీధి వ్యాపారులకు లోన్లను ఇస్తోంది. కాగా, ప్రభుత్వం 2030 నాటికి దేశంలో పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించాలనుకుంటే సస్టయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ను చేరుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.