- విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్)లో ఉన్న సభ్య దేశాల్లో ఓ దేశం టెర్రరిజంలో నిమగ్నమై ఉన్నంత కాలం ఈ సమావేశాలను నిర్వహించబోమని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. అలాంటి టెర్రరిజాన్ని ఇండియా సహించబోదని పాకిస్తాన్ను ఉద్దేశిస్తూ ఆయన కామెంట్ చేశారు. రాత్రి సమయాల్లో టెర్రరిజం, పగటి సమయాల్లో వ్యాపారం జరగడాన్ని తాము అనుమతించబోమన్నారు. ఇలా చేయడం ద్వారా దేశానికి మంచి జరుగుతుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు.
ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జైశంకర్ మాట్లాడారు. ‘‘ఈ మధ్య కాలంలో సార్క్ సమావేశాల గురించి మీరు పెద్దగా వినలేదు. కొన్నేండ్లుగా నేను కూడా దాని గురించి వినలేదు. ఎందుకంటే సార్క్లోని సభ్య దేశాల్లోని ఓ దేశం (పాకిస్తాన్)లో సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నాను. అక్కడ క్రాస్ బార్డర్ టెర్రరిజం వల్ల వారితో సాధారణ సంబంధాలు కొనసాగించలేకపోతున్నాం”అని జై శంకర్ పేర్కొన్నారు. సార్క్లో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక సభ్య దేశాలుగా ఉన్నాయి.
చైనా సరిహద్దులో పరిస్థితులు అసాధారణంగా ఉన్నయ్..
సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలను ఉల్లంఘించినందున ఇండియా, చైనా మధ్య సంబంధాలు అనుకున్నంత స్థాయిలో లేవని జైశంకర్ పేర్కొన్నారు. సరిహద్దులో పరిస్థితి నేటికీ అసాధారణంగా ఉందన్నారు. ఏ సంబంధమైన ఒకరినొకరు గౌరవించుకోవాలని, ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు..