ఢిల్లీలో కరోనా వైరస్ బారినపడి 55 ఏళ్ల సీఆర్పీఎఫ్ జవాన్ మరణించారు. దేశంలో సెంట్రల్ ఆర్డ్మ ఫోర్సెస్ లో నమోదైన తొలి మరణం ఇదేనని అధికారులు తెలిపారు. గత వారంలో ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ 31వ బెటాలియన్ కు వచ్చిన ఓ హెడ్ కానిస్టేబుల్ కు కరోనా సోకడంతో అక్కడున్న మరికొందరు వైరస్ బారినపడ్డారు.
జమ్ము కశ్మీర్ లోని కుప్వారా లోని 162వ బెటాలియన్ లో నర్సింగ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఆ హెడ్ కానిస్టేబుల్ సెలవుపై నోయిడా వచ్చారు. అయితే లాక్ డౌన్ కారణంగా అతడిని 31వ బెటాలియన్ లో రిపోర్ట్ చేయాలని సూచించారు ఉన్నతాధికారులు. అక్కడ డ్యూటీలో చేరిన తర్వాత ఏప్రిల్ 21న అతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో అతడితో కాంటాక్ట్ అయిన బెటాలియన్ సిబ్బంది పలువురికి టెస్టులు చేయగా దాదాపు 30 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అందులో ఒకరైన 55 ఏళ్ల ఎస్సై ర్యాంక్ సీఆర్పీఎఫ్ జవాన్ కూడా ఉన్నారు. అస్సాంలోని బర్పేటకు చెందిన ఆయనకు డయాబెటిస్, హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు ఉండడంతో కరనా ప్రభావం తీవ్రమైంది. మండావలీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం మరణించినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.