అవయవదానంపై ప్రజల్లో మరింత అవగహన పెంచేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా 42 రోజులు సెలవు ప్రత్యేక సెలవులను ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం 30 రోజుల పాటు ప్రత్యేక సెలవులు ఉండేలా నిబంధన ఉంది. దీనిని మరో 12 రోజులు పెంచాలని నిర్ణయించారు.
ఓ దాత అవయవదానం కోసం చేయించుకున్న సర్జరీ నుంచి కోలుకునేందుకు మరింత సమయం అవసరమని గుర్తించామని, అందుకే సెలవుల సంఖ్యను పెంచినట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిని కనీస గౌరవంగా భావిస్తున్నామని అంది. అయితే ఈ సెలవులను ఒకేసారి లేదా విడతలుగానైనా వినియోగించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కలిపించింది.
హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్న రోజు నుంచే ఈ సెలవులు కౌంట్లోకి వస్తాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన మెడికల్ ప్రాక్టీషనర్ సూచన మేరకూ ఈ సెలవులు ఇస్తారు. ఏమైనా అత్యవసర పరిస్థితులు వస్తే డాక్టర్ రికమెండేషన్ మేరకు మరో వారం రోజులు పొడిగిస్తారు. దీనికోసం అతడి నుంచి అధికారికంగా ఓ లెటర్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.