కైకాల, చలపతిరావు కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ

కైకాల, చలపతిరావు కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ

హైదరాబాద్: సినీ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కంభంపాటి రామ్ మోహన్ రావు, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అట్లూరి సుబ్బారావు, ఇతర రాష్ట్ర నాయకులతో కలసి కైకాల సత్యనారాయణ, చలపతిరావు ఇండ్లకు వెళ్లి పరామర్శించారు. 

కైకాల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేసినప్పటి నుంచి తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కైకాల కుటుంబ సభ్యులకు తనతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులంతా అండగా ఉంటామని అన్నారు. ఇవాళ ప్రత్యేకంగా ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

అలాగే చలపతిరావు కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు పరామర్శించారు. చలపతిరావు కుమారుడు నటుడు, దర్శకుడు రవిబాబు, ఆయన సోదరీమణులతో చంద్రబాబు మాట్లాడారు. చలపతిరావుతో చాలా మంచి సంబంధాలు ఉండేవని గుర్తు చేసుకున్నారు. చలపతిరావు భౌతికంగా లేకపోయినా.. అండదండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

కైకాల సత్యానారాయణ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 23న కన్నుమూశారు. అలాగే తమ్మారెడ్డి చలపతిరావు గత శనివారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు రేపు బుధవారం జరగనున్నాయి.