ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీలు) సెకండ్ వేవ్ సెగ తగులుతోంది. చెక్ బౌన్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) ఇంటర్బ్యాంక్ లావాదేవీలకు క్లియరింగ్ కోసం ఏర్పాటు చేసిన ‘నాచ్’ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో బౌన్స్ రేట్లు 30.7 శాతం ఉండగా, గత ఏడాది ఏప్రిల్లో బౌన్స్ రేట్లు 28 శాతం మాత్రమే ఉన్నాయి. వాల్యూమ్స్ లెక్కన చూస్తే ఇదే కాలంలో బౌన్స్ రేట్లు 34.1 శాతం నుంచి 35.8 శాతానికి పెరిగాయి. దీంతో ఎన్ బీఎఫ్సీ అసెట్ క్వాలిటీ ప్రమాదంలో పడింది. ఇది వరకే ఇబ్బందుల్లో ఎన్బీఎఫ్సీల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే మధ్య లెక్కలను చూస్తే బౌన్స్ రేటు 250 బేసిస్ పాయింట్లు పెరిగిందని ఎన్సీపీఐ ఈ–-నాచ్ (నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్) ప్లాట్ఫాం డేటా పేర్కొంది.
లాక్డౌన్లతో వసూళ్లు డౌన్
దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్లు లేదా రిస్ట్రిక్షన్లు/నైట్ కర్ఫ్యూలు ఉండటం ఎన్బీఎఫ్సీలకు ఇబ్బందిగా మారింది. దీంతో వసూళ్లు దారుణంగా తగ్గాయి. ముఖ్యంగా ఫిజికల్ కలెక్షన్లు.. అంటే అప్పు తీసుకున్న వాళ్లకు దగ్గరికి వెళ్లి కిస్తీలు వసూలు చేయడం చాలా వరకు తగ్గింది. గత రెండు నెలల్లో లోన్ వసూళ్ల సామర్థ్యం 10–-15 శాతం తగ్గింది. "ఏప్రిల్, మే నెలల వ్యాపారాలు నాశనమయ్యాయి. జనం దగ్గర డబ్బు లేదు. బిజినెస్ లు నడవడం లేదు. చాలా మంది ఒకటి లేదా రెండు కిస్తీల చెల్లింపులను ఆపేశారు. మా లోన్లు జూన్లో మొండిబాకీల కేటగిరీలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది” అని ఒక ప్రముఖ ఎన్బీఎఫ్సీ సీఈఓ చెప్పారు. తమ కలెక్షన్ టీమ్స్, సేల్స్ ఏజెంట్లు వసూళ్లను పెంచడానికి, బౌన్స్ రేట్లను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. గత ఏడాది లాక్డౌన్ల సమయంలో బౌన్స్ రేట్లు భారీగా తగ్గాయి. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని ఫైనాన్షియల్ ఎక్స్పర్టులు చెప్పారు. గత ఏప్రిల్ తోపాటు, ఈ ఏడాది ఏప్రిల్ లో చాలా చెక్కులు బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు. తక్కువ మొత్తం లోన్లు తీసుకునే వాళ్లో చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారని, ఇలాంటి వాళ్లలో మెజారిటీ బ్యారోవర్లు డిఫాల్టర్లు మారుతున్నాతున్నారని మరో ఎన్బీఎఫ్సీ సీఈఓ చెప్పారు. అన్సెక్యూర్డ్ క్రెడిట్ సెగ్మెంట్లో ఎగవేతలు వేగంగా పెరుగుతున్నాయని వివరించారు. అన్ సెక్యూర్డ్ లోన్లకు పూచీకత్తులు ఉండవని అన్నారు.