చెన్నైని వరుణుడు మరోసారి వణికించాడు. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలతో నగరం నీట మునిగింది. సిటీలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గంటల వ్యవధిలోనే 18సెంటీమీటర్ల వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి.
భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల నగరంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మత్తులు చేయడంతో ఆ గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ వర్షపునీరుతో జలమయమయ్యాయి. మరోవైపు మెట్రో పనులు కూడా జరుగుతుండటంతో వడపళనిలో వరదనీరు భారీగా వచ్చి చేరింది. అటుగా వెళ్లే వాహనదారులు రోడ్డు దాటలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎగ్మూర్, సెంట్రల్, పురసైవాక్కం, గిండి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ కాలువలను తలపించాయి.
బంగాళాఖాతంలో తూర్పు వైపు దిశగా గాలులు వేగంగా దూసుకుస్తున్నాయని... తీరం వెంబడి నగరాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ పరిసర జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
మరిన్ని వార్తల కోసం..