
బెంగళూరు: రెండు ఇన్నింగ్స్లు.. 24 ఫోర్లు, 33 సిక్సర్లు.. 444 పరుగులు. సగటు టీ20 అభిమాని కోరుకునేలా ఆతిథ్య రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సాగిన తీరిది. ఈ వీర బాదుడు ఆటలో చివరకు ఆర్సీబీపై పైచేయి సాధించిన సీఎస్కే చిన్నస్వామి స్టేడియంలో చిందేసింది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో సీఎస్కే 8 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. తొలుత డెవాన్ కాన్వే (45 బాల్స్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83), శివం దూబే (27 బాల్స్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52) దంచికొట్టడంతో చెన్నై 20 ఓవర్లలో 226/6 స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్లంతా తలో వికెట్ తీశారు. ఛేజింగ్లో గ్లెన్ మ్యాక్స్వెల్(36 బాల్స్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76), ఫా డుప్లెసిస్ (33 బాల్స్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62) చెలరేగినా చివర్లో తడబడ్డ ఆర్సీబీ ఓవర్లన్నీ ఆడి 218/8 స్కోరు చేసి ఓడింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్పాండే మూడు, మతీష పతిరన రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
దంచుడే దంచుడు..
చెన్నై ఇన్నింగ్స్ మెరుపు వేగంతో సాగింది. కాన్వే, దూబేకు తోడు మిగతా బ్యాటర్లూ పోటాపోటీగా షాట్లు కొట్టడంతో భారీ స్కోరు చేసింది. సిరాజ్ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్ రుతురాజ్ (3) ఔటైనా.. కాన్వే, రహానె (20 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) జోరు చూపెట్టారు. పార్నెల్ వేసిన ఆరో ఓవర్లో రహానె సిక్స్, రెండు ఫోర్లు రాబట్టడంతో పవర్ప్లేను సీఎస్కే 53/1తో ముగించింది. ఆపై కాన్వే వెంటవెంటనే రెండు సిక్సర్లతో మరింత స్పీడు పెంచాడు. హసరంగ బౌలింగ్లో రహానె క్లీన్బౌల్డ్ అవడంతో రెండో వికెట్కు 74 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. కానీ, కాన్వేకు తోడైన శివం దూబే శివాలెత్తిపోయాడు.వచ్చీరాగానే మ్యాక్స్వెల్ బౌలింగ్లో బంతిని స్టేడియం రూఫ్పైకి కొట్టి స్కోరు వంద దాటించాడు. ఆపై వైశాక్ ఓవర్లో కాన్వే 4,4,6తో చెలరేగాడు. హర్షల్, సిరాజ్ బౌలింగ్లోనూ దూబే రెండు భారీ సిక్సర్లు రాబట్టాడు. 15వ ఓవర్లో దూబే సిక్స్, కాన్వే 6,4 బాదడంతో సీఎస్కే 165/2తో నిలిచింది. వీళ్ల జోరు చూస్తుంటే జట్టు 250 స్కోరు చేసేలా కనిపించింది. కానీ, తర్వాతి ఓవర్లోనే స్లో యార్కర్తో కాన్వేను ఔట్ చేసిన హర్షల్ మూడో వికెట్కు 37 బాల్స్లో 80 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. చివర్లో ఆర్సీబీ బౌలర్లు కాస్త పుంజుకున్నారు. మొయిన్ అలీ (19 నాటౌట్), రాయుడు (14), జడేజా (10) మెరుపులతో సీఎస్కే స్కోరు 220 దాటింది.
చివర్లో తడబడి..
హిట్టర్లు మ్యాక్స్వెల్, డుప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ 61 బాల్స్లోనే 126 రన్స్ జోడించినా స్లాగ్ ఓవర్లలో తడబడ్డ ఆర్సీబీ విజయాన్ని చేజార్చుకుంది. భారీ టార్గెట్ ఛేజింగ్లో తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన 20 ఏండ్ల ఆకాశ్ వేసిన నాలుగో బాల్కే విరాట్ కోహ్లీ (6) ఔటవగా.. రెండో ఓవర్లో మహిపాల్ లమ్రోర్ (0) పెవిలియన్ చేరాడు. అదే ఓవర్లో కీపర్ ధోనీ కష్టమైన క్యాచ్ను మిస్ చేయడంతో లైఫ్ దక్కించుకున్న కెప్టెన్ ఫా డుప్లెసిస్కు తోడైన గ్లెన్ మ్యాక్స్వెల్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. ప్రతీ బాల్ను సిక్స్ కొట్టాలన్న కసితో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు ఫా కూడా భారీ షాట్లతో విజృంభించాడు. ఆకాశ్ వేసిన మూడో ఓవర్లో మ్యాక్సీ రెండు సిక్సర్లు కొట్టగా.. తర్వాతి రెండు ఓవర్లలో డుప్లెసిస్ నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో పవర్ప్లేలోనే ఆర్సీబీ 75/2 స్కోరు చేసింది. ఫీల్డింగ్ మారిన తర్వాత ధోనీ బౌలర్లను మార్చినా ఈ ఇద్దరి అదే జోరు కొనసాగించడంతో 10 ఓవర్లకే స్కోరు 121/2కి చేరుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. వీళ్ల జోరు చూస్తుంటే ఆర్సీబీ ఈజీగా గెలిచేలా కనిపించింది. 11వ ఓవర్లో మాక్సీ రిటర్న్ క్యాచ్ను డ్రాప్ చేసిన తీక్షణ తన తర్వాతి ఓవర్లో అతడిని పెవిలియన్ చేర్చడంతో మూడో వికెట్కు 126 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఆ వెంటనే మ్యాక్సీ మాదిరిగా మొయిన్ అలీ బౌలింగ్లో డుప్లెసిస్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇవ్వడంతో చెన్నై రేసులోకి వచ్చింది. అప్పటికి 14 ఓవర్లకు ఆర్సీబీ 159/4తో నిలవగా.. చివరి ఆరు ఓవర్లలో 68 రన్స్ అవసరం అయ్యాయి. ఈ దశలో సిక్స్, మూడు ఫోర్లతో వేగంగా ఆడిన దినేశ్ కార్తీక్ (14 బాల్స్లో 28) 17వ ఓవర్లో ఔటవడంతో బెంగళూరుపై ఒత్తిడి పెరిగింది. ఆ వెంటనే పతిరన బౌలింగ్లో షాబాజ్ (12) ఆరో వికెట్గా వెనుదిరగడంతో మ్యాచ్ చెన్నై చేతుల్లోకి వచ్చింది.12 బాల్స్లో 31 రన్స్ అవసరం అవగా.. క్రీజులో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభుదేశాయ్ (19) రెండు సిక్సర్లు కొట్టి ఆశలు రేపినా చివరి మూడు బాల్స్కు రెండే రన్స్ ఇచ్చిన పతిరన చెన్నైని గెలిపించాడు.