బాల్క సుమన్ ఓటమి ఖాయం : సరోజ

బాల్క సుమన్ ఓటమి ఖాయం : సరోజ
  • చెన్నూర్ ​కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ    
  • కాంగ్రెస్​లోకి చేరికలు

కోల్ బెల్ట్/జైపూర్, వెలుగు: అహంకారి బాల్క సుమన్ ఓటమి ఖాయమైందని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ అన్నారు. సోమవారం మందమర్రి మండలం కురుమపల్లి, పాత తిమ్మాపూర్ గ్రామాల్లో వివేక్ వెంకటస్వామి తరఫున సరోజ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇసుక దందాతో బాల్క సుమన్ వేల కోట్లు అక్రమంగా ఆర్జించాడని ఆరోపించారు. 

ప్రశ్నించే ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపించాడని మండిపడ్డారు. కేసీఆర్ బానిస బాల్క సుమన్ కు ఓటమి తప్పదని.. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన వివేక్ వెంకటస్వామి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేపట్టగా  గ్రామస్తులు గడ్డం సరోజకు ఘన స్వాగతం పలికారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ సత్తా చాటుతుంది: వివేక్ వెంకటస్వామి

పదేండ్ల బీఆర్ఎస్ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకొచ్చేం
దుకు సిద్ధంగా ఉన్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం మందమర్రి మండలం బొక్కల గుట్ట గ్రామం, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రాజీవ్ చౌక్, సూపర్ బజార్, రామాలయం చౌరస్తా, మందమర్రి మున్సిపాలిటీ లోని ప్రాణహిత కాలనీ, రెండో జోన్, మార్కెట్ ప్రాంతాల్లో సీపీఐ నేతలతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ నేతలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​లో చేరగా వారికి వివేక్ ​పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 

రామకృష్ణాపూర్​కు చెందిన సంజీవరెడ్డి, ప్రవీణ్ కుమార్, బానేశ్, శ్రీనివాస్, భూమేశ్ తదితరులు చేరారు. జైపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో యువకులు వివేక్​ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఆరెపల్లి, కొత్తపల్లి గ్రామాలతో పాటు చెన్నూర్​కు చెందిన 50 మంది యువకులకు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. 

ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ఆధ్వర్యంలో భీమారం మండల జర్నలిస్టుగా పనిచేసిన మంతెన సమ్మయ్య కాంగ్రెస్​లో చేరారు. ఈ కార్యక్రమంలో జైపూర్ మండలం సీనియర్ నాయకులు రిక్కుల శ్రీనివాస రెడ్డి, చల్లా సత్యనారాయణ రెడ్డి, ఆరెపల్లి గ్రామానికి చెందిన నాయకుల ఉష్కమల్ల వెంకటేశ్వర్లు, రమేశ్, రాజమల్లు, లింగయ్య పాల్గొన్నారు.

మందమర్రిలో భారీ ర్యాలీ

వివేక్ వెంకటస్వామిని భారీ మెజారిటీతో గెలిపించి సోనియా గాంధీకి గిప్ట్ ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ లీడర్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం అన్నారు. మందమర్రిలోని ఇందు గార్డెన్స్​లో సదానందం ఆధ్వర్యంలో 500 మంది వివేక్​ను గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివేక్ వెంకటస్వామి కుటుంబానికి, చెన్నూరు నియోజవర్గానికి ఉన్న అనుబంధం ఎంతో గొప్పదన్నారు. వారి తండ్రి కాకా వెంకటస్వామి రాజకీయ ప్రస్థానం చెన్నూరు నుంచే మొదలైందన్నారు.  

ఈ ప్రాంత ప్రజలకు విశాక చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందన్నారు. తాగునీటి సమస్య తీర్చేందుకు వేల సంఖ్యలో బోర్లు వేశారని గుర్తుచేశారు. కాకా వెంకటస్వామి ఆశయాలను ఆయన కుమారులు వినోద్, వివేక్ వెంకటస్వామి కొనసాగిస్తున్నారని కొనియాడారు. పదవి ఉన్నా, లేకున్నా కాకా కుటుంబం నియోజకవర్గ ప్రజలకు సేవలు చేస్తోందన్నారు. వివేక్​ను గెలిపిస్తే ఈ ప్రాంత యువకులకు 45 వేల ఉద్యోగాలు ఇప్పిస్తారని పేర్కొన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు.